ఇంకేం...మంచి ఛాన్సే కొట్టేసింది
హైదరాబాద్ : అందురూ ఊహించినట్లే ఆమెకు ఆఫర్స్ రావటం మొదలయ్యాయి. నటన,అందం ఉంటే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవటం కాదని మరోసారి ప్రూవ్ అయింది. ఇదంతా 'ఊహలు గుసగుసలాడే'తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాశిఖన్నా గురించి. తన నటనతో చిత్ర పరిశ్రమను ఆకర్షించింది. అందుకే ఆమెను అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా గోపీచంద్ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలిసింది.
యు.వి.క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పలువురు భామల్ని పరిశీలించారు. చివరికి రాశిఖన్నాను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇదివరకు ఆమె హిందీలో 'మద్రాస్ కేఫ్' అనే చిత్రంలో నటించి విజయాన్ని సొంతం చేసుకొంది. ఈ చిత్రంలో హీరోయిన్ కి మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం విడుదల కాగానే పెద్ద హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.

చంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడుగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. జూన్ నెల 6న చిత్రీకరణ ప్రారంభమైంది. ఈనెల 21 వరకూ కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
మణిశర్మ తనయుడు సాగర్ మహతి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ''మిర్చి తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. అన్ని వాణిజ్య హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది'' అని నిర్మాతలు చెప్తున్నారు.
అలాగే .. ''యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. చంద్రశేఖర్ యేలేటి దగ్గర పనిచేసిన రాధాకృష్ణకుమార్ తయారు చేసిన కథ, కథనాలు చాలా బాగున్నాయి. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ''అన్నారు. చలపతిరావు, బ్రహ్మానందం, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: శక్తిశరవణన్


Click it and Unblock the Notifications











