శంకర్ ‘ఐ’ తెలుగు ఆడియో వేడుక రద్దయిందా?
హైదరాబాద్: విక్రమ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఐ' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం తమిళ వెర్షన్ ఆడియో విడుదల కాగా, తెలుగు వెర్షన్ ఆడియో డిసెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ నుండి ప్రకటన వెలువడింది.
ఈ ఆడియో వేడుక హైదరాబాద్లోని శిల్ప కళా వేదికలో జరుగనుందని, ఈ వేడుకకు జాకీ చాన్ చీఫ్ గెస్టుగా హాజరు కాబోతున్నాడని అధికారికంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. ఏమైందో తెలియదు కానీ ఈ ఆడియో వేడుక రద్దయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

మరో మూడు రోజుల్లో ఆడియో వేడుక ఉందనగా....ఇంకా ఎలాంటి ఏర్పాట్లు మొదలు కాక పోవడం ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత ఆస్కార్ రవిచందర్ మాత్రం ఇతర కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే శంకర్ వద్ద పని చేస్తున్న వారు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. డిసెంబర్ 30న ఆడియో వేడుక జరుగుతుందని అంటున్నారు. మరి ఏం జరుగబోతోందో చూడాలి.
దర్శకుడిగా ఇంత వరకూ ప్రేక్షకులు మెచ్చిన ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇపుడు చియాన్ విక్రమ్ హీరోగా హాలీవుడ్ చిత్రాల స్థాయికి ధీటుగా ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ ఫిలింస్ అధినేత వి.రవిచంద్రన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ విజువల్ వండర్ను మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ప్రైలిమిటెడ్ సంస్థ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చియాన్ విక్రమ్, ఎమీ జాక్సన్ జంటగా నటించిన ఈచిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.


Click it and Unblock the Notifications











