ఏమన్నా మార్చారా? ('నీజతగా నేనుండాలి' ప్రివ్యూ)
హైదరాబాద్ : రీమేక్ సినిమాలు ఎంత సేఫో...అంత రిస్క్.. ఎందుకంటే ఒరిజనల్ భాషలో ఏయే కారణాలతో హిట్టైందో గమనించకుండా ఇక్కడ దించేస్తే సినిమా పత్తా లేకుండాపోతుంది. అలాగని యాజటీజ్ తీసేస్తే క్రియేటివిటీ లేదని పెదవి విరుస్తారు. అవన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు హిందీలో సూపర్ హిట్ అయిన 'ఆషికీ-2'ని తెలుగులో రీమేక్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా సంజయ్దత్ మేనకోడలు నజియా హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఒరిజనల్ చిత్రం కథ ఇస్తున్నాం. ఇక్కడ పెద్దగా మార్పులు చేయలేదని వినికిడి. ఆ మ్యాజిక్ వర్కువుట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.
ఆ చిత్రం కథేమిటంటే...- రాహుల్ జయకర్ (ఆదిత్య రాయ్ కపూర్) పాప్ సింగర్. అతనికి అశేష అభిమానులు. అతడు ఆడింది ఆట పాడింది పాట. కానీ ఒక్కటే లోపం. తాగుడుకు బానిస. గోవా టూర్లో ఉండగా- అర్ధరాత్రి 'బార్'లన్నీ మూసేయటంతో.. ఊరి చివరి బార్ అండ్ రెస్టారెంట్కి వెళతాడు. అక్కడ తన పాటని అంతకంటె మృదు మధురంగా ఆలపించిన ఆరోహి షిక్రె (శ్రద్ధా కపూర్) టాలెంట్కి ముగ్ధుడవుతాడు. తనతోపాటు ముంబై వస్తే సింగర్ని చేస్తానంటాడు. అతని మాటలు నమ్మి ముంబై చేరుకుంటుంది ఆరోహి. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ ఆస్పత్రి పాలవుతాడు. ఆరోహి చేసే ఫోన్లన్నీ రాహుల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని -రాహుల్ లండన్ వెళ్లాడని చెప్తాడు. దీంతో రాహుల్ని అపార్థం చేసుకుంటుంది ఆరోహి. రెండు నెలల తర్వాత రాహుల్ అసలు విషయం తెలుసుకొని ఆరోహి ఉన్న చోటికి వస్తాడు. అతడికి తెలిసిన మ్యూజిక్ కంపెనీలో ఆమెకి అవకాశం ఇప్పిస్తాడు. ఆమెలోని టాలెంట్ లోకానికి తెలుస్తుంది.

ఇటు సినిమాల్లోనూ అటు ప్రైవేట్ ఆల్బమ్లతోనూ బిజీగా మారిపోతుంది. అనుక్షణం ఆమెని అంటిపెట్టుకొని ఉంటూ సలహాలు సూచనలూ చెబుతూ ఆమెలో ధైర్యాన్ని నింపే రాహుల్ రోజుల తరబడి తాగటంవల్ల అతడి గొంతు దెబ్బ తింటుంది. కనీసం లోబడ్జెట్ సినిమాలకైనా పాడదామనుకుంటే అక్కడా ఎదురుదెబ్బ తగులుతుంది. రాన్రాను రాహుల్ పతనమవటం చూసిన ఆరోహి అతణ్ణి మళ్లీ మామూలు మనిషిగా.. గాయకుడిగా తీర్చిదిద్దాలనుకుంటుంది. దాంతో అతడి ఫామ్హౌస్కి వెళ్లిపోతారిద్దరూ. కానీ - గతంలో చేసిన అగ్రిమెంట్స్ కారణంగా మళ్లీ కెరీర్ని ఆరంభించాల్సి వస్తుంది ఆరోహి. తన వల్లనే ఆమె కెరీర్ నాశనమై పోతోందనీ.. తను లేకుంటే ఆరోహి జీవితం బాగుంటుందని తలచి ఆత్మహత్య చేసుకొంటాడు రాహుల్. ఆ తర్వాత ఆరోహి జీవితం ఏమైందన్నది క్లైమాక్స్.
పతాకం: పరమేశ్వర ఆర్ట్స్
నటీనటులు: సచిన్, నజియా, రావు రమేష్, శశాంక్, కాశీ విశ్వనాధ్, పృధ్వీ, రవివర్మ, అనితా చౌదరి తదితరులు
మాటలు:మధుసూదన్,
పాటలు:చంద్రబోస్, ఎడిటింగ్:గౌతమ్రాజు,
కెమెరా:ఎ.వసంత్,
సంగీతం: అంకిత్ తివారి,
నిర్మాత: బండ్ల గణేష్,
దర్శకత్వం: కె.రవీంద్ర.
విడుదల తేదీ: ఆగస్టు 22, 2014


Click it and Unblock the Notifications











