సమస్యల్లో ‘సరైనోడు’...కారణం పవన్ కళ్యాణా?
హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు' చిత్రం రేపు(ఏప్రిల్ 22)న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. విడుదల దగ్గరపడుతున్న వేళ సినిమాకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. నైజాం, కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాల్లో బయ్యర్లు చివరి నిమిషయంలో హ్యాండ్ ఇవ్వడంతో....గీతా ఆర్ట్స్ బేనర్ వారే ఈ సినిమాను సొంతంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.
మరో వైపు ఈ సినిమాకు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేయాలని ప్లాన్ చేసినా... హైదరాబాద్ లో పోలీసుల అనుమతి లభించలేదని సమాచారం. దీంతో ఈ సినిమాకు బెనిఫిట్ షోలు వేసుకునే భాగ్యం కూడా లేకుండా పోయింది. ఈ రెండు సమస్యలకు ప్రధాన కారణం ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' ఎఫెక్టే అని అంటున్నారు.

ఇటీవల విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని భారీ ధరకు కొన్న బయ్యర్లు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ భయంతోనే గీతా ఆర్ట్స్ వారు 'సరైనోడు' చిత్రానికి నిర్ణయించిన భారీ ధరకు కొనుగోలు చేయడానికి బయ్యర్లు ముందుకు రాలేదని తెలుస్తోంది. వారు అడిగిన రేటుకు ఇవ్వడం ఇష్టం లేని అల్లు అరవింద్ సినిమాను సొంతగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మిగతా ఏరియాల్లోనూ పరిస్థితి కాస్త అటు ఇటూగానే ఉందని, బేరసారాలు జరుగుతున్నాయని టాక్.
మరో వైపు ఇటీవల 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ ముందు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేసారు. అర్థరాత్రి ఈ షోల సందర్భంగా పోటెత్తిన అభిమానులను కంట్రోల్ చేయడానికి, బోనిఫిట్ షోల ముసుగులో కొందరు భారీ ధరకు టిక్కెట్లు అమ్ముతూ చేస్తున్న దోపిడీ అడ్డుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అందుకే పోలీసులు ఈ సారి చేతులెత్తేసినట్లు సమాచారం. 'సరైనోడు' సినిమాకు మాత్రమే కాదు ఇకపై విడుదలయ్యే ఏ సినిమాలకైనా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారట.


Click it and Unblock the Notifications











