Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పదవి పట్టుకుని వేలాడటం లేదు, చిల్లరగా ప్రవర్తిచకండి: ‘మా’జీ అధ్యక్షుడు శివాజీ రాజా
Recommended Video
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్ మీద నరేష్ ప్యానల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. నరేష్ ప్యానల్ మార్చి 22న ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకోగా... మార్చి 31 వరకు తన పదవి ఉంది, అప్పటి వరకు ఎవరూ ప్రెసిడెంట్ కుర్చీని టచ్ చేయడానికి వీల్లేదంటూ శివాజీ రాజా హెచ్చరించారని, అవసరం అయితే కోర్టుకైనా వెళతానని అతడు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నరేష్తో పాటు జీవిత, రాజశేఖర్, ఇతర సభ్యులు ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ఓడిన శివాజీ రాజా ఇంకా పదవి పట్టుకుని వేలాడుతున్నారంటూ అతడి తీరును తట్టుబట్టారు. ఈ నేపథ్యంలో వారికి కౌంటర్ ఇచ్చేందుకు మంగళవారం శివాజీ రాజా మీడియా ముందుకొచ్చారు.
హుందాగా ప్రవర్తించండి, చిల్లరగా వద్దు
ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఉంది. ఎలక్షన్ అయిపోయాక ఒక అధ్యక్షుడైనా, జనరల్ సెక్రటరీ అయినా హుందాగా ప్రవర్తించాలి. హుందాగా ప్రవర్తించడమా? లేక చిల్లరగా ప్రవర్తించడమా? అనేది వారి వారి మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హుందాగా ఉంటేనే మీకు సభ్యుల్లో రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను నాతో సహా రోడ్డు మీదకు తీసుకురాకండి. ఇంతకు ముందు ఎప్పుడూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు లేవు. గత నాలుగు సంవత్సరాల నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. మనసుకు అది కాస్త బాధ అనిపిస్తోందని శివాజీ రాజా తెలిపారు.
సంస్థ డబ్బుతో టీ కూడా తాగలేదు
ఈ మాట ఎందుకు అంటున్నానంటే... ఇక్కడ ఉండే 26 మందిలో ఎవరికీ జీతాలు ఉండవు. వీరంతా 800 మంది సభ్యులకు సేవ చేయడానికి వచ్చినవారే. ఇక్కడ ఎవరూ దుర్మార్గులు కూడా ఉండరు. కాకపోతే చిన్న చిన్న ఈగోస్ ఉంటాయేమో? నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చేపట్టని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు అన్ని పదవులు చేపట్టాను. ప్రతీ పదవి గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ డబ్బుతో ఒక టీ కూడా తాగలేదు అని గొప్పగా చెప్పుకోగలను.
నేను తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తా
సడెన్గా వస్తారు.. ఈ ఫైల్లో అంతా ఉందని చెబుతారు.. అందులో ఏమీ ఉండదని మాకు తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు అందరినీ ఫైల్ చూపించి మోసం చేస్తారు? ఏమైనా తప్పు చేశారంటే... చేశారని బయట పెట్టొచ్చుకదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. అందులో ఏమీ లేక పోతే మీరు శిక్ష అనుభవిస్తారా? అని శివాజీ రాజా ప్రశ్నించారు.
ఇక రెస్ట్ తీసుకుంటాను
ఇది నేను కోపంతో అనడం లేదు.. ప్రతీసారి ఫైల్ తీసుకుని వస్తారు నేను ఇన్ని గంటలకు ఫోన్ చేశాను, ఇన్ని గంటలకు నాకు రిప్లై వచ్చింది అని చెబుతుంటారు. ఇదా.. మనం ప్రజలకు చెప్పుకోవాల్సింది? నువ్వు ఎంత మందికి సేవ చేశావ్... ఎంత మందిని కాపాడావ్ అని చెప్పుకోవాలి. కొత్తగా వచ్చిన కమిటీ అలాంటి మంచి పనులు చేస్తుందని ఆశిస్తున్నాను. నన్ను రెస్ట్ తీసుకో అని తీర్పు ఇచ్చారు. నేను రెస్ట్ తీసుకుంటాను.
అందుకే మార్చి 31 వరకు ఉంటాను అన్నాను
నేను ఇంకా పదవి పట్టుకుని వేలాడుతున్నట్లు వార్తలు వచ్చాయి. నాకు ఏమిటి అవసరం? ‘మా'కు ఒక చట్టం ఉంటుంది. అంటే వారికి బై లా చదవే ఓపిక కూడా లేదు. జీవిత ఫస్ట్ టైమ్ వచ్చింది కాబట్టి తెలియదు అనుకోవచ్చు. మీకు(నరేష్) అంతకు ముందు సెక్రటరీగా పని చేసిన అనుభవం ఉంది కదా? మార్చిలో ఎలక్షన్ పెట్టండి, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కొత్తగా ఎన్నికైన వారు చార్జ్ తీసుకోండి అని క్లియర్ గా ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బై లా... నేను రాసింది కాదు. దీన్ని ఫాలో అవ్వాలి కదా. దాని ప్రకారమే నేను మార్చి 31 వరకు ఉంటలాను అన్నాను.
అలా చేయడం బాధ అనిపించింది
నేను గతంలో పదవి చేపట్టినపుడు కూడా ఇలానే చేశాను. ఓడిపోయాక ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం నాకేంటి? నాకు ఎవరైనా ఫోన్ చేసి సలహా అడిగితే చెబుతాను, కష్టాల్లో ఉంటే వెళ్లి సాయం చేస్తాను. నేను బై లా ప్రకారం చెప్పాను. వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ లోపే వారు ప్రెస్ మీట్ పెట్టేశారు. దీనికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ విషయాలు జనరల్ బాడీలో మాట్లాడుకోవాలి, ఈసీలో మాట్లాడుకోవాలి. 800 మంది సభ్యులకు సంబంధించిన విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏముంది? వారు అలా చేయడం బాధ అనిపించింది.
చిరంజీవి లాంటి వారు పోటీ చేయమంటేనే...
నేను ‘మా'లో ప్రతీ పదవి రెండు రెండు సార్లు చేసుకుంటూ వెళ్లాను. ఈ సారి ప్రెసిడెంటుగా ఉండను అని చెప్పాను. కానీ చిరంజీవి లాంటి వ్యక్తులు నువ్వు అందరినీ కలుపుకుని వెళతావు శివాజీ, ఎవరైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఉంటావని శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్వీ కృష్ణారెడ్డి వీరంతా కోరితే ప్రెసిడెంటుగా నిలబడ్డాను. అరుణాచలం వెళతాను అన్న విషయాన్ని కూడా ఎటకారంగా మాట్లాడారు. అది కూడా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నెగ్గాక ఎంత హుందాగా ఉండాలి? నేను తప్పకుండా వారికి ఏ అవసరం వచ్చినా తప్పకుండా అందుబాటులో ఉంటాను. మేమంతా ఒకటే కమిటీ... అందులో పొరపచ్చాల ఏమీ లేవని శివాజీ రాజా తెలిపారు.