మంచు మనోజ్ సంచలన నిర్ణయం, రాజకీయ ప్రయాణమా? ఆ లేఖలో ఏముందంటే....
Recommended Video

నటుడు మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వదలేసి తిరుపతికి షిప్ట్ అవుతున్నట్లు ప్రకటించారు. అలా అని నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు భావించ వద్దంటూనే తన రాజకీయ జీవితంపై ఎవరూ ఎలాంటి తీర్మాణాలు చేయవద్దని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ లేఖ సంధించారు.
మంచు మనోజ్ రాసిన ఈ లేఖ చూస్తుంటే..... తిరుపతి కేంద్రంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. సేవా మార్గంలో యువ నాయకుడిగా ఎదిగి క్రమక్రమంగా రాజకీయల వైపు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మనోజ్ రాసిన లేఖలోని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

తన గోల్ ప్రజాసేవే అంటున్న మనోజ్
తన వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకోవడానికి ‘పరుగు' కూడా ఒక రోజు జరుగెత్తడం ఆపేస్తుంది.. ఇవ్వాలో రేపో ప్రతి ఒక్కరికి ఈ పరిస్థితి తప్పదు. గమ్యం లేని లక్ష్యాలు ఎన్నటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయి. మన ప్రతి లక్ష్యానికి ఒక గోల్ ఉండాలి.. ఆ గోల్ మన చుట్టూ ఉండే ప్రజలను ఉద్దేశించేలా ఉండాలి.

ఇప్పటి వరకు సాగిన జీవితం, సినీ ప్రయాణం గురించి
ప్రపంచం మొత్తం తిరిగాను, అన్ని జాతుల, మతాల, కులాల ప్రజల్ని కలిశాను. ఒక్క చిన్న బ్రెడ్ ముక్క కసం గ్యారేజ్లో పని చేసేవాళ్లను చూశాను. ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాను. స్నేహితుల కోరిక మేరకు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాను. అన్ని సంతృప్తితో చేశాను. నా చుట్టూ ఉండే ప్రజల సంతోషం కోసమే చేశాను. ప్రపంచంలోని ప్రతి దిక్కూ తిరిగాను. దేశంలోని ప్రతి మూలా చూశాను. ఆ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచం అద్భుతం, అమోఘం.

తిరుపతి నుంచి సేవ కార్యక్రమాలు
నేను కోరుకునే మనశ్శాంతి నాకు తిరుపతిలో దొరికింది అని కచ్చితంగా చెప్పగలను. నేను పెరిగిన ప్రదేశం. నా ఎదుగుదలకు కారణమైన ప్రదేశం ఇది. స్వేచ్ఛగా ప్రపంచానికి రెక్కలు విప్పుకుని ఎగిరేలా చేసింది ఈ ప్రపంచం. అణువణువు దైవత్వంతో నిండి ఉన్న ఈ తిరుపతి గాలి పీల్చినపుడు ఏదో తెలీని పవర్ మరేదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది. ఇక్కడి రైతుల, పిల్లలకు విద్యను పొందడంలో సహాయం చేస్తాను.

తిరుపతికి షిప్ట్ అవుతున్నాను
తిరుపతి నుంచి మొదలయ్యే ఈ సహాయం ప్రపంచమంతా చేరువ అయ్యేలా తపిస్తాను. ముందుగా ఇక్కడి యువతకి సహాయపడేలా ఏదైనా చేస్తాను. నా వల్ల ఈ లోకానికి కలిగే ప్రయోజనమేంటో వెతికే క్రమంలో కొన్ని నెలల నిమిత్తం తిరుపతికి షిప్ట్ అవుతున్నాను.

నా సినీ, రాజకీయ జీవితంపై ఎలాంటి తీర్మాణాలు చేయొద్దు
రాయలసీమలో ప్రారంభించే నా సరికొత్త ప్రయాణం ఇక్కడికే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా నా అర్ధవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నా సినీ, రాజకీయ జీవితంపై ఎవరు ఎలాంటి తీర్మాణాలు చేయవద్దు. సినిమాలపై నాకున్న ఆసక్తి ఎప్పుడూ తగ్గదు. విలక్షణ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాలనే దాహం ఎప్పటికీ తీరదు.
రాగి సంకటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి
నా జీవితాన్ని ఈ నేల యువతకు అంకితం చేస్తున్నాను. రాయలసీమ వస్తున్నాను రాగి సంకటి, మటన్ పులుసు రెడీగా పెట్టండి..... అంటూ మంచు మనోజ్ తన లేఖలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











