వంద కోట్లు పెద్ద కష్టమేమి కాదు: నాగార్జున
నాగార్జున మాట్లాడుతూ... ''హిందీ సినిమాలకు దేశ విదేశాల్లో పెద్ద మార్కెట్ ఉంది. అదే ప్రాంతీయ చిత్రాలకు సొంత రాష్ట్రం తప్ప మిగతా చోట్ల మార్కెట్ అంతగా ఉండట్లేదు. ఒకవేళ పెద్ద హీరోల సినిమాలు పక్క రాష్ట్రాల్లో విడుదలవుతున్నా... తక్కువ థియేటర్లకే పరిమితం అవుతున్నాయి. దీంతో వసూళ్లు కూడా తక్కువగా వస్తున్నాయి. స్టార్ హీరోలు నటించిన హిందీ సినిమాలు 2000కు పైగా మల్టీప్లెక్స్ల్లో విడుదలవుతోంటే... మన ప్రాంతీయ భాషా చిత్రాలు మాత్రం 200 మల్టీప్లెక్స్ల్లో కూడా విడుదలవడం లేదు'' అన్నారు.
అలాగే మార్కెటింగ్ సూత్రాలు పాటించి భారీస్థాయిలో సినిమాల్ని విడుదల చేస్తే దక్షిణాది చిత్రాలు కూడా రూ.వంద కోట్ల మైలురాయిని సులభంగా చేరతాయి. ఇక్కడొచ్చిన కథల్నే బాలీవుడ్ దర్శకనిర్మాతలు అక్కడకు తీసుకెళ్లి 'వాంటెడ్', 'సింగమ్', 'బాడీగార్డ్', 'రెడీ', 'రౌడీ రాథోడ్' లాంటి చిత్రాల్ని రూపొందించి రూ.వంద కోట్లు వసూళ్లు సాధించిన విషయం అందరికీ తెలిసిందే అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తమిళ సినిమా ఆ కోవలో పయనిస్తుండటం ఆనందదగ్గ విషయమని పేర్కొన్నారు. గత సంవత్సరం రూ.70 కోట్ల పెట్టుబడితో విజయ్ హీరోగా వచ్చిన దక్షిణాది సినిమా తుపాకీ రూ.80 కోట్ల మార్క్ ను దాటటం కూడా శుభసూచకమన్నారు. అంతకుముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన 'ఎంథిరన్' (తెలుగులో శివాజీ) రూ.200 కోట్లను మార్కెట్ కు చేరి భారతీయ సినీ చరిత్రలో రికార్డు నెలకొల్పిన విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు.
దక్షిణాది సినిమాల్లో కథ బలంగా తక్కువగా ఉండటం కూడా వైఫల్యాలకు ప్రధాన కారణంగా కనబడుతుందన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ దక్షిణాదిన మంచి మార్కెట్ తో చరిత్ర సృష్టిందని విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. ఆ సినిమా తమిళనాట మొదటి మూడోవారాల్లోనే రూ.8 కోట్లను వసూలు చేసి సంచలన విజయం దక్కించుకోవడం వెనుక కథ బలమే ముఖ్యకారణమన్నారు.
నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన నటించిన 'భాయ్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు అక్కినేని ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలతో 'మనం' చిత్రం తెరకెక్కుతోంది. ఈ రెండు చిత్రాలను నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications












