శవాలపై రాజకీయాలు వద్దు: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
హైదారాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం తొక్కిసలాట జరుగడంతో పదుల సంఖ్యలో భక్తులు మరణించారు. ఈ ఘటనపై ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అదే సమయంలో ఈ విషాద సంఘటనను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పొలిటీషియన్స్ పై ఆయన మండి పడ్డారు.

‘రాజమండ్రిలో జరిగిన విషాద సంఘటన నన్ను చాలా బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. రాజకీయ నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఈ విషాద సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసి పని చేయండి, బాధితులకు, వారి కుటుంబాలకు సహాయం అందించండి' అంటూ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పేర్కొన్నారు.
ఊహించని రీతిలో వేలాది మంది ఒక్కసారిగా భక్తులు పోటెత్తినపుడు అధికారులుక కూడా చేయాల్సింది ఏమీ ఉండదు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు కాస్త దూకుడగా ప్రవర్తిస్తే మళ్లీ మనం వారినే నిందిస్తాం. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు కూడా క్రమశిక్షణగా మెలగాలి, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు స్వార్థంగా ప్రవర్తించకూడదు, ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకూడదు అని ఆయన విజ్ఞప్తి చేసారు.


Click it and Unblock the Notifications











