అశ్రునయనాల మధ్య శ్రీహరి అంత్యక్రియలు(ఫోటోలు)
హైదరాబాద్: నటుడు శ్రీహరి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య గురువారం సాయంత్రం హైదరాబాద్ శివారు ప్రాంతం బాచుపల్లిలోని ఆయన సొంత ఫాంహౌస్లో జరిగింది. జూబ్లీహిల్స్లోని శ్రీహరి నివాసం నుంచి బాచుపల్లి వరకు సాగిన అంతిమ యాత్రలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. భారీగా అభిమానులు రావడంతో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేసారు.
బుధవారం ముంబైలోని లాలీవతి ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా మరణించిన ఆయన మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో గురువారం తెల్లవారు ఝామున హైదరాబాద్ తరలించారు. డి. రామానాయుడు, దాసరి నారాయణరావు, చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, జూ ఎన్టీఆర్, తరుణ్, బ్రహ్మానందం, జయసుధ, కృష్ణ, విజయ నిర్మల, అలీ, మోహన్ బాబు, మంచు విష్ణు, సుధ, హేమ, సుబ్బరాజు, రాగుబాబు, ఎస్ఎస్ రాజమౌళి, చలపతిరావు, అల్లు అరవింద్, కృష్ణంరాజు, రాఘవేంద్రరావు తదితరులతో పాటు వందలాది మంది సినీ సెలబ్రిటీలు ఆయన కడచూపు కోసం తరలి వచ్చారు.
శ్రీహరి లాంటి గొప్ప నటుడు, మంచి వ్యక్తి, పరోపకారి అందరినీ విడిచి వెళ్లడం తీరని లోటని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.... స్లైడ్ షోలో శ్రీహరి అంత్యక్రియలకు సంబంధించిన ఫోటోలు.

శ్రీహరి
కృష్ణా జిల్లా ఎలమర్రు గ్రామంలో జన్మించిన శ్రీహరి.....15 ఏళ్ల వయసులోనే ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ షిప్ట్ అయ్యారు. హైదరాబాద్ లోని బాలా నగర్లో వారి కుటుంబం స్థిరపడింది. స్టంట్ ఫైటర్గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి, దాసరి నారాయణరావు ద్వారా పరిచయం అయ్యారు.

రజనీకాంత్ చిత్రంతో నటుడిగా
1989లో వచ్చిన రజనీకాంత్, అమల, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘మాపిళ్లై' చిత్రంతో శ్రీహరి నటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఈ తమిళ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.

హీరోగా ప్రవేశం
1993లో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రీహరి 1999లో వచ్చిన ‘పోలీస్' చిత్రం ద్వారా హీరోగా మారారు. ఈచిత్రం శ్రీహరికి మంచి పేరు తెచ్చింది.

పరిశ్రమలో ప్రముఖుడిగా
తన టాలెంటుతో శ్రీహరి క్రింది స్థాయిన నుంచి ప్రముఖుడిగా పరిశ్రమలో ఎదిగారు. కెరీర్లో ఆయన 98 చిత్రాల్లో నటించారు. ఢీ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర, తుఫాన్ చిత్రాలు క్యారెక్టర్ ఆర్టస్టుగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

శ్రీహరి ఫ్యామిలీ
తన సహచర నటి శాంతిని శ్రీహరి 1998లో వివాహమాడారు. వారికి ఇద్దరు కుమారులు. కూతురు అక్షర నాలుగు నెలల వయసులోనే మరణించింది. కూతురు పేరుతో ఫౌండేషన్ స్థాపించి సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. మేడ్చల్ మండలంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

మరణం
ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ షూటింగులో భాగంగా ముంబై వెళ్లిన ఆయనకు చాతిలో నొప్పి రావడంతో లీలావతి ఆసుపత్రికి తరలించారు. బీపీ డౌన్ అయిందని వైద్యులు తెలిపినట్లు ఆయన భార్య శాంతి తెలిపారు.


Click it and Unblock the Notifications











