త్రివిక్రమ్ మారుతాడా?: జూ.ఎన్టీఆర్తో సినిమాకు ఆ 'కథ', కానీ చిక్కంతా?
Recommended Video

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ గమనించట్లేదని అనుకుంటుందట. ఇదో సామెత. ఇప్పుడీ సామెతకు తగ్గట్లే ఉంది దర్శకుడు త్రివిక్రమ్ వ్యవహరిస్తున్న తీరు. హాలీవుడ్ కథల్ని కొట్టుకొచ్చేస్తే జనం కనిపెట్టలేరని ఆయన అనుకుని ఉండొచ్చు.
కానీ 'అజ్ఞాతవాసి'తో ఆయనకు ఇప్పటికైనా క్లారిటీ వచ్చి ఉండాలి. ప్రేక్షకులు చాలా అలర్ట్ గా ఉన్నారన్న విషయం బోధపడి ఉండాలి. స్ఫూర్తిగా తీసుకున్నా.. లేక వేరేవాళ్ల కథనే తీసుకున్నా.. నిజాయితీగా వాళ్లకు క్రెడిట్ ఇచ్చేస్తే త్రివిక్రమ్ కు ఈ తిప్పలు ఉండేవి కావు కదా! అంటున్నారు ప్రేక్షకులు..

ఇప్పుడిదంతా ఎందుకు?
సరే, ఇప్పుడీ విషయమెందుకంటే.. త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను జూ.ఎన్టీఆర్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి 'అజ్ఞాతవాసి' లాంటి డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేస్తాడా? లేదా? అన్న అనుమానం తలెత్తినా.. సినిమా పట్టాలెక్కడం ఖాయమనే తెలుస్తోంది. కానీ త్రివిక్రమ్ 'కథ' దగ్గరే మళ్లీ ఓ చిక్కు వచ్చి పడిందంటున్నారు.

ఏంటా చిక్కు:
ఎన్టీఆర్తో తెరకెక్కించే సినిమాకు కూడా త్రివిక్రమ్ సొంతంగా కథ రాసుకోలేదట. ఓ ప్రముఖ నవల నుంచి ఆయన కథను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రచయిత పేరు తెలియనప్పటికీ.. త్రివిక్రమ్ వారికి క్రెడిట్ ఇస్తారా? ఇవ్వరా? అన్న దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

ఇప్పుడైనా క్రెడిట్ ఇస్తాడా?:
ఇప్పటికే కాపీ వివాదాలతో తన ఇమేజ్ తానే డ్యామేజ్ చేసుకున్న త్రివిక్రమ్.. ఇకనైనా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే బెటర్ అని ఆయన సన్నిహితులు సలహా ఇస్తున్నారట. కాబట్టి ఎన్టీఆర్ తో సినిమాకు ఆయన ఏ నవలా రచయిత కథనైతే ఎంచుకున్నారో.. ఆయనకు కథా క్రెడిట్ ఇస్తేనే మంచిదని సూచిస్తున్నారట. అయితే త్రివిక్రమ్ మనసులో ఏముందనేది మాత్రం తెలియట్లేదంటున్నారు.

పెద్ద డ్యామేజ్..:
'అజ్ఞాతవాసి' కంటే ముందు త్రివిక్రమ్ మీద మరీ ఇన్నేసి విమర్శలేమి లేవు. కానీ ఇంత భారీ డిజాస్టర్ మూటగట్టుకోవడంతో.. ఆయన గత సినిమాల పోస్ట్ మార్టమ్ కూడా జరిగిపోయింది. ఆయన చేసిన చాలా సినిమాల్లోని కథలు హాలీవుడ్ నుంచి దించేసినవే అన్న విమర్శలు వెల్లువెత్తాయి. త్రివిక్రమ్ కూడా వీటిని ఖండించే ప్రయత్నం చేయకపోవడంతో ఆయన డిఫెన్స్ లో పడ్డారేమో అన్న అభిప్రాయాన్ని కలగజేసింది.

సొంతంగా రాసుకునేవాళ్లు తక్కువ?:
నిజానికి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న దర్శకుల్లో చాలామంది సొంతంగా కథలు రాసుకోలేరు. దర్శకులు రాజమౌళి, వినాయక్ లాంటి వాళ్లు రచయితలతో రాయించుకున్న కథలతోనే సినిమాలు తీస్తున్నారు.
తన అన్ని సినిమాలకు తానే కథలు రాసుకునే పూరి జగన్నాథ్ కూడా మొన్నామధ్య 'టెంపర్' కోసం వక్కంతం వంశీ కథను తీసుకున్నాడు.

త్రివిక్రమ్కు సలహా:
కాబట్టి త్రివిక్రమ్ కూడా భేషజాలకు పోకుండా ఏ రచయిత నుంచైనా మంచి కథను సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. లేదూ.. తానే రాసుకోగలడు అనుకుంటే.. కాస్త టైమ్ తీసుకున్నా ఫర్వాలేదు కానీ ఈసారి మంచి కథతో రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఈసారి కసితో చేస్తాడా?:
'అజ్ఞాతవాసి' రిలీజ్ కు ముందు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ సినిమా విడుదలైందో వారికి టెన్షన్ పట్టుకుంది. ఎన్టీఆర్ సినిమా పట్ల కూడా త్రివిక్రమ్ అలసత్వంగా వ్యవహరిస్తే కష్టమంటున్నారు. అయితే త్రివిక్రమ్ కు కూడా ఇప్పుడు మరోసారి తానేంటో నిరూపించుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి.. ఈసారి కసిగానే హిట్ కొడుతాడనేవారు లేకపోలేదు. చూడాలి మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో!


Click it and Unblock the Notifications











