కేసు పెట్టారు..తమన్నాను తీసుకున్నారు
హైదరాబాద్ : శ్రుతిహాసన్ కి పివిపి సంస్దకు ఉన్న విభేదాలతో ఆమె వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె ప్లేసులో నటి తమన్న ఎంపికైనట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ద్విభాషా చిత్రాన్ని పీవీపీ సిని మా సంస్థ నిర్మిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఒక హీరోయిన్గా (కార్తీకి జంటగా) నటి శ్రుతిహాసన్ను ఎంపిక చేశారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అయితే చివరి నిముషంలో చిత్ర షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరుణంలో ఆమె చిత్రం చేయడం లేదని చెప్పడం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఆమెపై కోర్టులో కేసులు వేయడం వంటి పరిణామాలు పాఠకులకు తెలిసిందే. కొత్త చిత్రాలను అంగీకరించరాదని శ్రుతిపై కోర్టు ఆదేశించిన తరుణంలో ఆమెపై హైదరాబాద్ పోలీసులు కేసును నమోదు కూడా చేశారు.
ఇక ఇలాంటి పరిస్థితిలో శ్రుతి వైదొలగిన చిత్రంలో ఆమెకు బదులుగా తమన్న ఎంపికైనట్లు సమాచారం. కాగా కార్తీ తమన్నలది హిట్ పెయిర్. వీరిద్దరూ కలసి నటించిన పైయ్యా, చిరుదై చిత్రాలు విజయం సాధించాయి. అదే విధంగా తమన్నకు తమిళం, తెలుగు భాషలలో మంచి పేరే ఉంది. తమిళంలో వీరం చిత్రం తరువాత ప్రస్తుతం ఆర్యతో కలసి ఒక చిత్రం చేస్తున్నారు.
దీంతో శ్రుతి హాసన్ పాత్రలో ఆమె బెటర్ అన్న నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు తమన్నను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారిక పూర్వకంగా వెల్లడించలేదన్నది గమనార్హం.

నాగార్జున, కార్తీ, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో పీవీపీ సినిమాస్ నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రంలో మొదట నటిస్తానని చెప్పి.. ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత డేట్లు ఖాళీలేవంటూ నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చిన శ్రుతి.. కోర్టు చేత చివాట్లు తిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాలో ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలిసింది.
ఒకటి రెండు రోజుల్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఫ్రెంచ్ చిత్రం 'ది ఇన్ టచబుల్' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్ ఓ వ్యాధిగ్రస్తుడిగా, అతని సహాయకుడి పాత్రలో కార్తీ నటిస్తున్నారు. కార్తీకి జోడిగా తమన్నా ఎంపిక ఖరారవ్వడంతో గతంలో శ్రుతితో చేసిన సీన్లన్నీ రీషూట్ చేయాలని దర్శకుడు వంశీ అనుకుంటున్నాడట.
శ్రుతి చర్యతో తాము తీవ్రంగా నష్టపోయామని పీవీపీ సినిమాస్ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వివాదం పరిష్కారమయ్యేంతవరకు కొత్త సినిమాలేవీ అంగీకరించొద్దని కోర్టు శ్రుతి హాసన్ ను ఆదేశించింది. తమన్నా ప్రస్తుతం రవితేజ సరసన 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తోంది.
మరో ప్రక్క రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో తమన్న హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్ ల్లోనూ కనిపించనుంది. అయితే రెండో పార్ట్ లో ఆమె తక్కువ సేపు కనిపిస్తుంది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడింది.
'బాహుబలి'లో తను పోషించిన పాత్ర గురించి తమన్నా చెబుతూ ''సినిమాలో నేనూ కత్తిపట్టి పోరాటాలు చేశా. ఆ విషయంలో రాజమౌళిగారు మార్గనిర్దేశం చేశారు. 'బాహుబలి' మొదటి భాగంలో పూర్తిస్థాయిలో కనిపిస్తా. రెండో భాగంలో నా పాత్ర పరిధి తక్కువగా ఉంటుంది.'' అంది తమన్నా.
అలాగే... రాజమౌళి తీస్తున్న సినిమా ఎలా ఉంటుందో అందులో నటించేవాళ్లకు కూడా పూర్తిగా తెలియదు. ఆ దృశ్యాలు కేవలం రాజమౌళి వూహల్లోనే ఉంటాయి. అందుకే 'బాహుబలి' గురించి ఎవరైనా అడిగినప్పుడు... వూహకు కూడా అందని అంశాల్ని వూహించమని మాత్రం చెబుతుంటా'' అంది తమన్నా.
ఇక దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోందామె. తమిళం, హిందీ భాషల్లో నటిస్తున్నా... నన్ను తెలుగు హీరోయిన్ గానే గుర్తిస్తుంటారని చెబుతోంది. త్వరలోనే ఆమె 'బాహుబలి' చిత్రంతో సందడి చేయబోతోంది. మరోపక్క 'బెంగాల్ టైగర్'లో రవితేజ సరసన ఆడిపాడుతోంది.
తమన్నా మాట్లాడుతూ... ''తెలుగు హీరోయిన్ అనిపించుకోవడాన్ని గర్వపడతా. ఇక్కడ నేను చేసిన సినిమాలే నాకు ఆ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయినా... నటీనటులకు భాషాభేదాలు ఉండవు. తమిళం, హిందీ చిత్రాలతోనూ ప్రేక్షకులకు చేరువ కావడం ఎంతో సంతృప్తినిచ్చింది''అని చెబుతోంది.
అలాగే... ''సొంతంగా నిర్ణయాలు తీసుకొనేంత స్థాయికి ఎప్పుడో వచ్చాను. హీరోయిన్ గా ప్రయాణం మొదలైన తక్కువ సమయంలోనే ఆ పరిణతిని సాధించా. అలాగని ప్రతిదీ నాకు నచ్చినట్టు చేయను. అప్పుడప్పుడు సన్నిహితుల అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకొంటా. చివరికి మాత్రం మనసు ఏం చెబితే అదే చేస్తా'' అని చెబుతోంది తమన్నా.
ఇక సినిమాల ఎంపిక విషయంలో ఎవరిపైనైనా ఆధారపడుతుంటారా? అని అడిగితే ''కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సన్నిహితులతో చర్చిస్తుంటానంతే. ఎంపిక మాత్రం నాదే. అలా చేయడమే సబబు అని నమ్ముతా. మన మనసు చెప్పిందే చేసుంటాం కాబట్టి... వాటి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరిస్తాము''అని సెలవిచ్చింది తమన్నా.


Click it and Unblock the Notifications











