ఢిల్లీ రేప్ : తనికెళ్ల శపథం, ప్రియమణి ఆగ్రహం..
ఢిల్లీ : ఇటీవల జరిగిన ఢిల్లీ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించడమే కాదు.... వరుసగా రెండు రోజుల పాటు పార్లమెంటు ముట్టడికి, తీవ్ర ఉద్రిక్త పరిస్తితులకు దారి తీసింది. దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. సామాన్య ప్రజలు, సినీ తారలు ఇలా అందరూ....రేపిస్టులను ఉరితీయాలంటూ నినదించారు.
తాజాగా ప్రముఖ తెలుగు సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఢిల్లీ రేప్ ఘటనపై శపథం చేసారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులకు శిక్ష పడే వరకు తాను నల్లటి దుస్తులే ధరిస్తానని శపథం చేసారు. మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అకృత్యాలు దారుణమని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ రేప్ ఘటన తర్వాత తన కూతురు కళ్లలోకి కూడా తాను సూటింగా చూడలేక పోతున్నానని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు జరుగకుండా, పునరావృతం కాకుండా భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు. రేప్ ఘటనను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన యువతపై లాఠీచార్జ్ చేయడాన్ని తనికెళ్ల భరణి ఖండించారు.
ఈ ఘటనపై హీరోయిన్ ప్రియమణి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని, ఆ శిక్షలను చూసి మహిళలపై అఘాయిత్యానికి పాల్పడటానికి ప్రతిఒక్కరూ భయపడేలా ఉండాలని, వారిని ఉరితీయడానికి కూడా వెనకాడకూడదని ప్రియమణి వ్యాఖ్యానించింది. మహిళలు అత్యాచారానికి గురైనప్పుడు వారిని ఆబాధ జీవితాంతం వెంటాడుతుందన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ....కమిటీల పేరుతో కాలయాపన చేయవద్దని, నిందితులకు వెంటనే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసారు. శిక్షలు వేయడం లేటయితే అలాంటి ఘటనలకు పాల్పడే వారిలో భయం అనేది ఉండదని, వెంటనే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.


Click it and Unblock the Notifications











