ఆత్మహత్య మహాపాతకం అని చెప్పి: జీవితం చప్పగా ఉందన్న రంగనాథ్
హైదరాబాద్: ఆత్మహత్య మహా పాతకం అని చెప్పిన నటుడు రంగనాథ్.. ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. రంగనాథ్ శనివారం నాడు తాను అద్దెకు ఉండే ఇంటి వంట గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న నటుడు ఉదయ్ కిరణ్కు కూడా ఓ సమయంలో రంగనాథ్ ధైర్యం చెప్పారట.
అలాంటి రంగనాథ్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడంతో సినీ పరిశ్రమ కంటతడి పెడుతోంది. చచ్చి సాధించేదేమీ లేదని, బతికి సాధించాలని రంగనాథ్ గతంలో చెప్పారు. తన భార్యకు ఓ ప్రమాదంలో వెన్నుపూస విరిగి మంచాన పడినప్పుడు... సినిమా అవకాశాలు వదులుకొని ఆమెకు సేవలు చేశారు.
2009లో ఆమె మృతి చెందినప్పటి నుంచి ఒంటరిగా ఒత్తిడికి లోనవుతున్నారని చెబుతున్నారు. పైగా సినిమా అవకాశాలు అంతంత మాత్రమే ఉండటం కూడా ఆయనకు బోర్గా ఉండి ఉంటుందని చెబుతున్నారు.

జీవితం బోర్గా ఉందని, ఏం చేస్తున్నా తృప్తి లేదని.. రంగనాథ్ తన కూతురు నీరజతో చెబుతుండేవారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. రంగనాథ్లో కొద్ది రోజులుగా మార్పు వచ్చిందని చెబుతున్నారు. పైవాడి పిలుపు కోసం వేచి చూస్తున్నానని పైకి చూస్తూ నిర్వేదంగా చెప్పేవారని చెబుతున్నారు.
సినిమా అవకాశాలు రాకపోవడం, ఒంటరితనం ఆయనను కుంగదీసినట్టు పలువురు భావిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ... ఉదయ్ కిరణ్కూ ఓ సమయంలో ధైర్యం చెప్పిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు.
రంగనాథ్ వంటి మంచి నటుడికి వేషాలు లేవంటే.. ఓ విధంగా సినిమా రంగం కూడా ఆయన ఆత్మహత్యకు కారణమని అభిప్రాయపడ్డారు. ఆయనను సినిమాల్లో బిజీగా ఉంచితే ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండకపోయేవాడని అభిప్రాయపడ్డారు.
కాగా, రంగనాథ్ అంత్యక్రియలు బన్సీలాల్ పేట శ్మశానవాటికలో ఆదివారం సాయంత్రం ముగిశాయి. రంగనాథ్ అంత్యక్రియలకు పలువురు సినీ ప్రముఖులు, ఇతరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రంగనాథ్ చితికి తనయుడు నిప్పు అంటించాడు.


Click it and Unblock the Notifications











