శ్రీరెడ్డి మీద టీఎఫ్సిసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోలీస్ కంప్లైంట్!
టాలీవుడ్లో తన వ్యాఖ్యలతో సంచలనం రేపుతున్న నటి శ్రీరెడ్డి మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండర్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ఈ ఫిర్యాదు చేశారు. తన తప్పుడు ఆరోపణలతో తెలుగు సినిమా పరిశ్రమలోని వారిని కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు.
సైబర్ క్రైం పోలీసులు శ్రీరెడ్డి కేసులో ఎవిడెన్స్ గ్యాదర్ చేసే పనిలో ఉన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఆమెపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీరెడ్డి మీద అందిన తొలి కంప్లయింట్ ఇదే.
తెలుగు సినిమా పరిశ్రలో కాస్టింగ్ కౌచ్ తీవ్రంగా ఉందని, అవకాశాల పేరుతో పలువురు దర్శకులు, నిర్మాతలు నీచంగా ప్రవర్తిస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. తెలుగు వారికి కాకుండా ఇతర పరిశ్రమలకు చెందిన వారికి అవకాశాలు ఇవ్వడంపై కూడా ఆమె పోరాటం చేస్తోంది.

సోమవారం శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో ఓ టాప్ డైరెక్టర్ను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. 'కొమ్ములు వచ్చిన శేఖరుడు' అంటూ ఆమె తన పోస్టులో అతడిపై పలు ఆరోపణలు చేశారు. ఆ దర్శకుడు ఎవరు? అంటూ అంతా చర్చించుకున్నారు.
మంగళవారం ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన ట్విట్టర్లో స్పందిస్తూ .... ''నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది.
ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను." అని వ్యాఖ్యానించారు. శ్రీరెడ్డి పోస్టుపైనే శేఖర్ కమ్ముల ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











