అక్కినేనికి సంతాపంగా బంద్ (ఫోటోలు)
తెలుగు సినిమా లెజెండ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ బంద్ పాటిస్తోంది. ఈ విషయమై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ మీడియాతో మాట్లాడుతూ....షూటింగులు బంద్ చేస్తున్నామని, థియేటర్ల యజమానులు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ఆయన కోరారు.
తెలుగు సినిమా పరిశ్రమ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లు మూసి వేసారు. నేడు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయన చివరి చూపుకోసం హైదరాబాద్ చేరుకుంటున్నారు.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అక్కినేని నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 2-45 నిముషాలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో 1920 సెప్టెంబర్ 20న ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన అక్కినేని వయస్సు 91 సంవత్సరాలు. 1944లో సినీ ప్రస్థానం మొదలెట్టిన నాగేశ్వరరావు తొలి చిత్రం ధర్మపత్ని. చివరి చిత్రం మనం. ఆయన ధరించిన ఎన్నో పాత్రలు చిరస్మరణీయాలై మిగిలిపోయాయి.

అక్కినేని నాగేశ్వరరావు
దేవదాసుగా అలరించినా, దసరాబుల్లోడిలా మురిపించినా, ప్రేమాభిషేకంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించినా అది ఒక్క ఏ.ఎన్.ఆర్కే సాధ్యం.

సినిమా దిగ్గజం
256 చిత్రాలలో ప్రేక్షకులను మురిపించి మరిపించారు. ఇటీవల తనకు కేన్సర్ ఉందని ధైర్యంగా ప్రకటించి నిండు నూరేళ్లు జీవిస్తానని, అందుకు ప్రేక్షక అభిమానుల ఆశీర్వాదాలు బలాన్నిస్తాయని చెప్పిన ఆయన, అంతలోనే తన జీవన ప్రస్థానాన్ని ముగించారు.

మలుపు తిప్పిన దేవదాస్
అక్కినేని సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం దేవదాసు. బెంగాలీ రచయిత శరత్ రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఆ చిత్రం ప్రారంభ దశలో అక్కినేని నాగేశ్వరరావు వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆ పాత్రను నాగేశ్వరరావు నటించలేడని, ఆయన ముఖంలో దేవదాసుకు సంబంధించిన భావాలు పలకవని వాదించినవారిచేతే చిత్రం విడుదలయ్యాక శభాష్ అనిపించుకున్నారు.

చిన్నతనం నుండే
తొమ్మిదవ ఏటనుండి నటించడమే వృత్తిగా పెట్టుకున్న ఆయన అందుకోని సన్మానాలు, అవార్డులు లేవు. అక్కినేని చిన్నతనంలో పాఠశాల వార్షికోత్సవంలో సత్యభామ వేషం వేస్తే, ఇటీవల దూరమైన అలనాటి కళాభినేత్రి అంజలీదేవి రుక్మిణి వేషం వేసేవారట.

సంతాపంగా బంద్
అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా నేడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ బంద్కు పిలుపునిచ్చింది. చిత్ర పరిశ్రమలోని అన్ని యూనియన్లు బంద్ పాటించాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ పిలుపునిచ్చారు.


Click it and Unblock the Notifications











