టాలీవుడ్ లో ఈరోజు అన్ని షూటింగ్ లూ బంద్
ఈ రోజు టాలీవుడ్ లో జరగనున్న షూటింగ్స్ అన్నింటికి బంద్ ప్రకటించారు. విదేశాలలో జరుగుతున్న షూటింగ్స్ ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
దర్శక రత్న దాసరి మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న దాసరి హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. తెలుగు సినీరంగంలో దిగ్గజ దర్శకునిగా, నటునిగా, రచయితగా ఖ్యాతినార్జించిన దాసరి నారాయణరావు మృతితో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. కడసారి చూపు కోసం సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్ద బారులు తీరారు.

కార్మికుల కోసం
మొదటి నుంచీ కార్మికుల కోసం పనిచేసేందుకు మొగ్గుచూపే దాసరి పరిశ్రమను నమ్ముకొని వచ్చే వారికి అండగా నిలవాలని తలచారు. పరిశ్రమకు వస్తున్న వారి బాగోగుల కోసం ఫిలిం ఫెడరేషన్ యూనియన్ను స్థాపించారు. ఆ తరువాత 24 విభాగాలకు యూనియన్లు ఏర్పాటు చేసి అవి ఫిలింనగర్కు సమీపంలో ఉన్న కృష్ణానగర్లో ఉండేలా నాంది పలికింది ఆయనే.

ఖాళీ ప్రభుత్వ స్థలం ఉన్నా
దీనికి కారణం లేకపోలేదు. ఫిలింనగర్ చెంతనే ఖాళీ ప్రభుత్వ స్థలం ఉన్నా... చిన్న వస్తువు కోసం కార్మికులు అమీర్పేట వరకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవారని గ్రహించిన ఆయన అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న యూసుఫ్గూడ చెంతనే ఉన్న కృష్ణానగర్ను కార్మికులు ఉండే ప్రాంతంగా ఎంచుకున్నారు.

అగ్ర హీరోలదగ్గరినినుంచీ
ఇప్పటికీ సినీపరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్స్ కృష్ణానగర్లోనే కొనసాగుతున్నాయి. అందుకే ఆయన మరణానికి అగ్ర హీరోలదగ్గరినినుంచీ జూనియర్ ఆర్టిస్టులవరకూ కన్నీళ్ళు పెట్టారు. ఆయన మరణాన్ని ఇప్పటికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.నటుడిగా, రచయితగా,దర్శకుడిగా ఇలా రంగాలలో తన దైన ముద్ర వేసిన దాసరి కి అన్ని ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు.

షూటింగ్స్ అన్నింటికి బంద్
ఇక ఈ రోజు టాలీవుడ్ లో జరగనున్న షూటింగ్స్ అన్నింటికి బంద్ ప్రకటించారు. విదేశాలలో జరుగుతున్న షూటింగ్స్ ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రోజు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఎంటర్ టైన్ మెంట్ కి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగవంటూ మా అసోసియేషన్ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











