కాజల్ తొలి చిత్రం నిర్మాత మృతి, ఆయన ఆఖరి చిత్రం రిలీజ్ కు సిద్దం
హైదరాబాద్ : ఈ రోజున స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కాజల్ అగర్వాల్ ని పరిచయం చేస్తూ సినిమా తీసిన నిర్మాత కావూరి చంద్రశేఖర్ (జీతూ). ఆయన హైదరాబాద్ లో ఆదివారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన వయస్సు 40.
జీతూ ప్రముఖ నిర్మాత, ఎ.ఎ. ఆర్ట్స్ అధినేత కె.మహేంద్ర తనయుడు. శ్రీహరి హీరోగా 'ఒక్కడే', 'కల్యాణ్రామ్ హీరోగా 'లక్ష్మీకల్యాణం' చిత్రాలను జీతూ నిర్మించారు. జీతూ ఆకస్మిక మరణానికి తెలుగు నిర్మాతలమండలి సంతాపాన్ని తెలియజేసింది. సినీబజార్ ఆయన మృతికి సంతాపం తెలియచేస్తూ , ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటోంది.
అదేంటో...ఆయన మృతి చెందాక ఆయన చిత్రం విడుదలకు నోచు కుంటోంది. గత నాలుగు సంవత్సరాలుగా మూలన పడ్డ ఈ సినిమాకు ఇప్పుడు మోక్షం కలుగుతోంది. ఆ చిత్రం మరేదో కాదు అర్జున.

డా రాజశేఖర్ మళ్ళీ తన పాత ఫార్ములాతో ముందుకు వస్తున్నాడు. 'అన్నయ్య', 'సూరీడు', 'మనసున్న మారాజు', 'గోరింటాకు' వంటి కుటుంబకథా చిత్రాల తరహాలో ఈసారి 'అర్జున'గా రాబోతున్నాడు. ఎ.ఎ.ఆర్ట్స్పతాకంపై కె.చంద్రశేఖర్ (జీతూ), వి.కళ్యాణ్ చక్రవర్తి నిర్మించిన ఈ చిత్రానికి కణ్మణి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో డా రాజశేఖర్ సమకాలీన రాజకీయ ప్రతినిధిగా నటిస్తున్నారు. ఈనాటి యూత్కు ప్రతినిధిగా రాజశేఖర్ కన్పించబోతున్నారు. రెండు పాత్రలను వైవిధ్యంగా పోషిస్తున్నారని దర్శకుడు చెప్పాడు.
విజయవాడ బ్యాక్డ్రాప్తో చిత్రం రూపొందుతుందన్నారు. సమాజాన్ని మార్చాలనే అన్నాహజారే తరహాలో ఉండే తండ్రి పాత్రకు కొడుకు పాత్ర ఏవిధంగా తోడ్పడి తననుకున్న గోల్ను రీచ్ అయ్యాడనేది కథాంశమని దర్శకుడు వివరించారు.
పాత్ర ఎలా ఉంటుందనేది చెబుతూ.. అన్నాహజారే అంటే నీతిమంతుడైన వ్యక్తని, అటువంటి గుణాలున్న సూర్యనారాయణ పాత్రను రాజశేఖర్ పోషించారని చెప్పాడు. ఆయన భార్యగా తమిళ, మలయాళ నటి రేఖ నటిస్తోంది. చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం ఆట్టుకునే ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications











