Don't Miss!
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
త్రివిక్రమ్ స్పీచ్ సూపర్బ్: బూతులు లేకుండా చాలా కష్టం అంటూ...
గుంటూరు: తెలుగు సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరొందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎలాంటి విషయాన్ని అయిన జనాలకు నచ్చేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆయన ఏం మాట్లాడినా మామూలుగా ఉండదు. అందులో ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాలన్నీ, ఆయన మాటలన్నీ, ఆయన ప్రసంగాలన్నా తెలుగు ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు.
తాజాగా గుంటూరులో జరిగిన 'అ...ఆ' మూవీ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చారు. అందులో సినిమాకు సంబంధించిన విషయాల కంటే ప్రతి ఒక్కరి జీవితానికి మంచి చేసే ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ....చాలా కాలంగా నేను ఒక ఒక మామూలు కథను చెప్పాలని అనుకున్నాను. దాన్ని బలంగా చెప్పాలి, ఎక్కువ మలుపులు ఉండకూదను, ఎక్కువ కమర్షియల్ ట్విస్ట్లు వద్దు, ఎక్కువ హైప్ వద్దు, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, క్లైమాక్స్ వద్ద రక్తపాతం వద్దు, మామూలు కథ చెప్పాలనుకున్నాను. మనం ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కజిన్స్తో గొడవ పడతాం, అత్తలతో మాట్లాడతాం, నాన్నతో మాట్లాడతాం, బ్రదర్స్తో, చెల్లెల్లతో చాలా విషయాలు పంచుకుంటాం, అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటాం, అక్కడే ఆనందిస్తాం, అక్కడే పశ్చాత్తాప పడతాం, అలా ఉండే చిన్న చిన్న విషయాలతో సినిమా చేయాలనుకున్నాను...అదే 'అ..ఆ' అని త్రివిక్రమ్ తెలిపారు.
'నా దృష్టిలో మనిషి గొప్పోడు... అతని కలలు, ఆశయాలు గొప్పవైతే పైకి ఎక్కుతాడు. అతని అలవాట్లు, ఆశయాలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు. మనం ఇపుడు చాలా చిన్న చిన్న విషయాలు, మన ఇష్టాలు మాట్లాడుకోవడం మానేసాం. ఫోన్ చూస్తూ హలో చెబుతున్నాం...టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం. ఇంటికెళ్లిన తర్వాత అమ్మ వాళ్లతో మాట్లడకుండా మనకిష్టమైన సీరియల్ చూస్తున్నాం, లేదంటే రాత్రి 12 గంటల వరకు ఇంగ్లీష్ సినిమాలు చూసి పడుకుంటున్నాం. మన వాళ్లతో మాట్లాడుకోవడం మానేసాం. ప్రపంచం బావుండాలంటే మనం ఏమీ చేయక్కర్లేదు. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మాట్లాడుకుంటే చాలు.' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
'మనం బావుండాలంటే ఏవో గొప్ప గొప్ప పనులు చేయాలనుకుంటారు చాలా మంది. సరిగ్గా ఊపిరి పీల్చుకుంటే మనిషికి 98 శాతం జబ్బులు రావు. దానికి బదులు డబ్బులు పెట్టి సిగరెట్టు కొనుక్కొని చచ్చిపోవడానికి సిద్ధమవుతాం. గాలి ఫ్రీగా దొరుకుతుంది దాన్ని పీల్చం..డబ్బులు పెట్టి సిగరెట్టు కొనుక్కొని పీల్చుతాం. మంచి నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం... కానీ 10 రూపాయలు పెట్టి మంచినీళ్లు కొనం.. 60 రూపాయలు పెట్టి బీరు బాటిల్ కొని పాడైపోతాం.. దేవుడు అమ్మానాన్నల్ని ఫ్రీగా ఇచ్చాడు. చాలా ఉచితంగా ఇచ్చేసాడు. దానికి అసలు ఖర్చే లేదు. కానీ మనం ఎక్కువ డబ్బులు పెట్టి బ్యాంకాక్, అమెరికా, దుబాయ్ వెళ్లి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటామంటే దానికి ఎవరూ ఏం చేయలేరు' అని త్రివిక్రమ్ వ్యాఖ్యానించారు.
బూతులు లేకుండా కష్టపడాల్సి వస్తోంది
‘అ..ఆ సినిమా విషయానికొస్తే.. చాలా మెత్తగా, అమాయకంగా ఉండే వినోదాన్ని మనం ఎందుకు ఇవ్వలేం. బూతులు లేని, వికలాంగుల మీద గానీ, కులం మీద గానీ, మతం మీద కానీ, లోపాల మీద కానీ జోకులు వేయకుండా ఎవరినీ నొప్పించకుండా వీలున్నంత వరకు మన మధ్య ఉండే మాటలతోనే నవ్వించే ప్రయత్నం నేను మొదటి నుండీ చేస్తూనే ఉన్నా..అదే నా ప్రయాణం కూడా. అందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
లేటైనా సరే మంచి మాటలే చెప్పాలనిపిస్తుంది
ఒక బూతు జోకు వేస్తే వెంటనే నవ్వుతారు. కానీ నవ్విన వెంటనే మనల్ని తక్కువగా చూస్తారు. అదే ఒక గొప్ప మాట చెబితే అర్థం కాక వెళ్లి పోవచ్చు..కానీ దారి మధ్యలో గుర్తొస్తే ఫోన్ చేసి మరీ అభినందిస్తారు. ఒక్కోసారి లేటైనా సరే మంచి మాట చెప్పాలనిపిస్తుంది అని త్రివిక్రమ్ తెలిపారు.
చారు, మజ్జిగ లాంటి సినిమా
‘రెగ్యులర్ గా రెస్టారెంట్లలో మసాలా ఫుడ్ తినే మనకు ఫుడ్ పాయిజన్ అయితే ఓ మూడ్రోజుల పాటు చారు అన్నం తిను, మజ్జిగ అన్నం తిను అని డాక్టర్లు చెబుతుంటారు. మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు ఇది చారు మజ్జిగ లాంటి సినిమా. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు. ఎక్కువ తీపి ఉండదు..ఎక్కువ ఉప్పు ఉండదు. కొంత మంది ఇందులో రుచి ఏమీ లేదు అని అనుకోవచ్చు' అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.
ఏ తప్పు చేయకుండా కష్టమే..
‘గుంటూరులో పుట్టిన శంకర మంచి సత్యంగారు అని అమరావతిలో అని ఓ పుస్తకం రాసారు...అందులో ఓ కథలో ఓ వ్యక్తి రోజు ఉదయాన్నే లేచి నదికి స్నానానికి వెళ్లి, గుడికి వెళ్లి శివుడి మీద చెంబుడు నీళ్లు పోసి ఇంటికి వెళ్లి వాళ్ల ఆవిడకి ఏం కూర వండాలో చెబతాడు. ఆమె వండినది తిని అరుగు మీద కూర్చుని రోడ్డున వెళ్లే వారితో సరదాగా కబుర్లు చెప్పుకంటూ.. సాయంత్రం స్నేహితులతో సరదాగా గడిపి...రాత్రి మళ్లీ వాళ్ల ఆవిడకి ఏం కూర వండాలో చెప్పి ఆమె వండింది తిని పడుకుంటాడు. పండగలప్పుడు గుడికి వెళ్లి అందరితో పాటు భజన చేస్తాడు. ఆయన ఓ 60, 70 ఏళ్లకి చనిపోతాడు. ఇదే కథ...అంతకు మించి ఏమీ లేదు. ఈ పుస్తకంలో చివరలో ఓ మాట రాస్తారు. ఏ తప్పూ చేయకుండా ఇలా బ్రతకడం సాధ్యమేనా? అవును నిజమే చాలా మందికి ఇది సాధ్యం కాదు. రోడ్డున వెలుతుంటే ఓ అందమైన అమ్మాయి వెలుతుంటే విజిల్ వేయాలనిపిపస్తుంది...ఓ పెద్దాయన కింద పడితే నవ్వు వస్తుంది. కానీ అలా చేయడం తప్పు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనం ఎన్నో చేస్తుంటాం ఏ తప్పూ చేయకుండా బ్రతికిన వారే మహానుభావులు' అంటూ త్రివిక్రమ్ తనదైన రీతిలో ప్రసంగించారు.
వీడియో...
త్రివిక్రమ్ సీచ్ కు సంబంధించిన వీడియో....