ఓసారి ఉదయ్ కిరణ్ జ్ఞాపకాల్లోకి: ఈ రోజే ఎందుకంటే..?
హైదరాబాద్: వారసత్వం... లేకుండా కేవలం తన టాలెంటును నమ్ముకుని ఎన్నో కలలతో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన నటుడు ఉదయ్ కిరణ్. తెరంగ్రేటం తోనే వరుస విజయాలతో అనతి కాలంలోనే తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ప్రయాణం అనుకోని మలుపులతో మధ్యంలోనే ఆగిపోయింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై ఇప్పటికీ ఎన్నో తీరని సందేహాలు. నేడు ఉదయ్ కిరణ్ జయంతి. ఈ సందర్భంగా ఓ సారి ఆయన జ్ఞాపకాల్లోకి...
ఉదయ్ కిరణ్ జూన్ 26, 1980లో జన్మించారు. నటించిన తొలి చిత్రం ‘చిత్రం' మంచి విజయం సాధించడం, పెర్ఫార్మెన్స్ పరంగా ఉదయ్ కిరణ్ మంచి మార్కులు కొట్టేయడంతో వరుస అవకాశాలతో పాటు, వరుస హిట్లు అతని పలకరించాయి. ముందు నుండి లవర్ బాయ్ గానే ముద్ద పడ్డ ఉదయ్ కిరణ్ మాస్ హీరో అనిపించుకోవాలని తపించాడు. ఇందుకోసం ఆయన ఎంచుకున్న కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేక పోయాయి. వరుస ప్లాపులతో క్రమంగా కెరీర్ పథనం అయింది. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన ఆయన జనవరి 5 2014న ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలుగు సినిమా పరిశ్రమలో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య అప్పట్లో ఓ సంచలనం. ఆయన మరణం తర్వాత అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించాడని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. ఉరి వేసుకోవడంతో ఊపిరి ఆడక అతను ప్రాణాలు వదిలినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టులో శాస్త్రీయ అధ్యయనం వల్ల మరణాని గల భౌతిక కారణాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అయితే అతన్ని ఆత్మహత్య వైపు పురగొల్పిన మానసిక కారణాలు మాత్రం ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు.
అవకాశాలు లేక పోవడం వల్లనే మనో వేదనతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. 'చిత్రం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్, ఆ తర్వాత 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' లాంటి వరుస విజయాలతో హాట్రిక్ విజయం సాధించాడు. దీంతో ఆయనకు లవర్ బాయ్ హీరో అనే ముద్ర పడిపోయింది. ఆ తర్వాత ఆయన వద్దకు ప్రేమ కథలతో కూడిన సినిమాలే రావడం మొదలైంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.
దీంతో ఆలోచనలో పడ్డ ఉదయ్ కిరణ్....తాను లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయట పడాలనే ఆలోచనకు వచ్చాడు. మాస్ అండ్ యాక్షన్, ఇతర డిఫరెంటు సినిమాలు కూడా తాను చేయగలను అనే గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉనికి కాపాడు కోవాలన్నా, టాప్ రేంజికి ఎదగాలన్నా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే ఉత్తమ మార్గమనే ఆలోచనకు వచ్చాడని తెలుస్తోంది. అందుకే ఆయన మామూలు ప్రేమకథా చిత్రాలను తిరస్కరించడం మొదలు పెట్టాడు. మాస్, యాక్షన్ కథాంశాలు చేసినా అవి ప్లాపవడంతో మనో వేదనకు గురవుతూ వచ్చాడని స్పష్టమవుతోంది.
ఉదయ్ కిరణ్కు అవకాశాలు లేక పోవడం అనే వాదనలో నిజం లేదని, ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినా.....వాటిని తన చేజేతులారా దూరం చేసుకున్నాడని స్పష్టమవుతోంది.
ఓ దర్శకుడు ఉదయ్ కిరణ్తో ఓ ప్రేమ కథా చిత్రం సినిమా చేయడానికి ప్రయత్నించి విఫలమైన విషయాన్ని అప్పట్లో మీడియా దృష్టికి తెచ్చాడు. అతనితో జరిపిన ఫోన్ సంభాషణను మీడియాకు లీక్ చేసాడు. అందుకు సంబంధించిన వివరాలు..

ఉదయ్ కిరణ్: ఇంకా ఎక్కడ లవర్ బాయ్ అండీ
దర్శకుడు : లేదు సార్, ఉందండీ ఇంకా
ఉదయ్ కిరణ్ : కేవలం యాక్షన్ సినిమాలో, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో చెయ్యాలనో నేను ఇలా మాట్లాడటం లేదు, కొంచెం డిఫరెంటుగా సినిమా అయినా నేను రెడీ. నేను చేసిన సినిమాల్లో కంటే ఇపుడు నేను చేసే క్యారెక్టర్లో చాలా వేరియేషన్ ఉండాలి. ఇపుడు ఇలాంటి రొమాంటిక్ క్యారెక్టర్లు చేయడం లేదండీ నేను. నాకు కూడా కెరీర్ పరంగా ఎదుగుదల ఉండాలి కదా, క్యారెక్టర్ పరంగా కూడా ఎదుగుదల ఉండాలి కదా. 13 ఏళ్ల క్రితం చేసిన మనసంతా నువ్వే చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే కష్టం కదండీ. తమిళ్, హిందీల్లో చాలా వేరియేషన్స్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. మనం మాత్రం ఇంకా లవ్ స్టోరీలు, యాక్షన్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలేనా?.... అంటూ ఆ దర్శకుడి ప్రతిపాదనను తిరస్కరించాడు.
తిరస్కరణ అనంతం దర్శకుడితో ఉదయ్ కిరణ్: మీ ప్రాజెక్టుకు బెస్ట్ విషెస్, మీరు తీసే సినిమా బాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మధ్యలోనే ఆగిపోయిన ఉదయ్ కిరణ్ సినిమాలు
1. ఎఎం రత్నం సూర్య మూవీస్ పతాకంపై 'ప్రేమంటే సులువుకాదురా' చిత్రం ప్రారంభించారు. 80 శాతం పూర్తయిన ఈచిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది.
2. ప్రత్యూష క్రియేషన్స్ వారు ఉదయ్ కిరణ్-అంకితతో మొదలు పెడదామనుకున్న సినిమా క్యాన్సిల్ అయింది.
3. అంజనా ప్రొడక్షన్స్ వారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్-అసిన్ జంటగా తీద్దామనుకున్న సినిమా రద్దయింది.
4. బాలకృష్ణ హీరోగా 'నర్తనశాల' సినిమా అనుకున్నారు. ఈచిత్రంలో ఉదయ్ కిరణ్ అభిమాన్యుడి పాత్రకు తీసుకోవాలనుకున్నారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు.
5. ఉదయ్ కిరణ్-త్రిష జంటగా జబ్ వి మెట్ తెలుగు వెర్షన్ ప్లాన్ చేసారు కానీ వర్కౌట్ కాలేదు.
6. సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు 'లవర్స్' అనే సినిమాను ఉదయ్ కిరణ్-సదా జంటగా ప్లాన్ చేసారు కానీ క్యాన్సిల్ అయింది.
7. ఆదిశంకరాచార్య సినిమా సినిమా నిర్మాత సమస్యల వల్ల రద్దయింది.
8. మనసంతా నువ్వే, నీ స్నేహం సినిమాల తర్వాత ఉదయ్ కిరణ్ తో ఎంఎస్ రాజు తీద్దామనుకున్న చిత్రం రద్దయింది.
9. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ ను ఓ సినిమాకు అనుకున్నారు కానీ ఆ తర్వాత సినిమా క్యాన్సిల్ అయింది.
చివరి చిత్రం ఆగి పోయింది...
ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. 'నువ్వునేను' ఫేమ్ అనిత ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో డింపుల్, గరిమ, మదాలస శర్మ ఇతర పాత్రల్లో నటించారు. మున్నా చిత్ర నిర్మాత. మోహన్ ఏయల్లార్కే దర్శకుడు.
ఈ చిత్రం.... రెండు సంవత్సరాలుగా వివిధ కారణాలతో విడుదలకు నోచుకోలేదు. ఉదయ్ కిరణ్ తొలి జయంతి రోజే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అప్పట్లో వీలు కాలేదు. తాజాగా జూన్ 26న ఉదయ్ కిరణ్ 2వ జయంతి(నేడు) సందర్భంగా ఆయన చివరి జ్ఞాపకం అయిన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. కానీ కోర్టు చిక్కుల కారణంగా విడుదల కాలేదు.


Click it and Unblock the Notifications











