ఆర్టిస్ట్ లను టార్గెట్ చేయటం పద్దతి కాదంటూ స్టార్ హీరోయిన్
ముంబై: జమ్ము కశ్మీర్ లో ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదదాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు తర్వాత పాక్ నటీనటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
అంతేగాక పాక్ నటులకు అవకాశం ఇవ్వరాదని, ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంఎన్ఎస్ హెచ్చరించింది. తాజాగా పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో కరణ్ జోహార్ సహా బాలీవుడ్ నిర్మాతలు కొందరు ఇరకాటంలో పడ్డారు.
ఈ నేపధ్యంలో సినిమాలకీ, రాజకీయాలకు సంభంధం లేదంటూ చాలా మంది గళం విప్పుతున్నారు. పాక్ నటుడు నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు కష్టాలు ఎదురయ్యాయి.
తాజాగా నటీనటులపైనే లక్ష్యం ఎందుకు? అంటూ పాక్ నటీనటుల నిషేధంపై ప్రియాంక చోప్రా మాట్లాడారు. ప్రస్తుతం 'క్వాంటికో సీజన్-2' సిరీస్ షూటింగ్ నిమిత్తం న్యూయార్క్లో ఉన్న ప్రియాంక తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ..''నాకు దేశ భక్తి ఉంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే. కానీ ఈ విషయంలో కేవలం నటీనటులనే ఎందుకు లక్ష్యం చేయాలి? నా దేశంలో ఏం జరుగుతోందో అన్నీ తెలుసుకుంటున్నాను. కానీ రాజకీయంగా ఎలాంటి ఘటనలు జరిగినా లక్ష్యం చేసేది నటీనటులు, కళాకారులనే.
వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులని, వైద్యులని ఎందుకు వేలెత్తి చూపరు? భారత్ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. కానీ ఈ విషయంలో పాక్ నటీనటులు ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. అలాంటప్పుడు వారికి వ్యతిరేకంగా ఉండలేం కూడా. ఒకరు చేసిన పనికి వారినే శిక్షించాలి కానీ, వారి స్థానంలో కళాకారులని శిక్షించాలనుకోవడం తప్పు.
మనది గాంధీజీ నడిపిన దేశం. అహింసకు కట్టుబడి ఉంటాం. సైనికులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించడంపై మనం శ్రద్ధ వహించాలి. నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి మరిచిపోయి అనవసరమైన వాటిపై ఎక్కువగా చర్చిస్తుంటాం.'' అని తన అభిప్రాయాలను వెల్లడించింది ప్రియాంక.
మరో ప్రక్క కరణ్ జోహార్ కు మద్దతుగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్వీట్ చేశాడు.
'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్ కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్ లో పాక్ కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ తీశారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు
గతేడాది డిసెంబర్ లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాల ప్రదర్శనపై థియేటర్ల యజమానులు నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపట్టాడు.
ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, సహా కొందరు నిర్మాతల కు థియేటర్ యజమానులు షాకిచ్చారు. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించరాదని యజమానులు నిర్ణయించారు. విడుదలకు సిద్ధమైన కరణ్ జోహార్ తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్ లో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు.
ఈ సినిమాలో ఫవాద్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించడంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కష్టాల్లో పడింది. గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ సినిమాపై నిషేధం విధించారు.


Click it and Unblock the Notifications











