‘పద్మ శ్రీ’ అవార్డు అందుకున్న కోట (ఫోటో)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఆయన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఢిల్లీ ఈ అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకోవడంపై కోట సంతోషం వ్యక్తం చేసారు.
మూడు దశాబ్దాలకుపైగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న కోట శ్రీనివాసరావు కి భారత ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన సన్నిహితులు అంటున్నారు. పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

తనకు అవార్డు రావడంపై కోట శ్రీనివాసరావు గతంలో స్పందిస్తూ..''నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చా. ఇక్కడ నిర్మాతలు, దర్శకులు అందించిన ప్రోత్సాహంతో నిలబడ్డాను. నా విజయాల వెనుక, అందుకొనే పురస్కారాల వెనుక సినీ పరిశ్రమలోని అందరి కృషి ఉంది. ఇన్నేళ్లుగా సీనీ రంగానికి నేను చేసిన సేవకు, నా నటనకు గుర్తింపుగా ప్రభుత్వం నాకీ పురస్కారం అందించిందని భావిస్తున్నాను. నేనెప్పుడూ బాధ్యతతోనే వ్యవహరించా. ఇక ముందు మరింత బాధ్యతతో పనిచేస్తా. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నా'' అన్నారు.


Click it and Unblock the Notifications











