ప్రముఖ హిందీ సినీ నటుడు సయీద్ జాఫ్రీ కన్నుమూత
ముంబై: హిందీ చలనచిత్ర రంగం మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు సయీద్ జాఫ్రీ (86) ఆదివారంనాడు కన్నుమూశారు. 1929 జనవరి 8న పంజాబ్లోని మాలెర్ కోట్లాలో జన్మించారు. 1968లో సినీరంగంలోకి ప్రవేశించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జాఫ్రీ ఆదివారం తుదిశ్వాస విడిచారు. పలు హిందీ, ఆంగ్ల నాటకాల్లో నటించిన జాఫ్రీ బాలీవుడ్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. జాఫ్రీ నటించిన తొలి చిత్రం ‘స్టాక్డ్'.
ప్రముఖ దర్శకుడు రిచర్డ్ అటెన్ బరో రూపొందించిన ‘గాంధీ' సినిమాలో సర్దార్ పటేల్గా జాఫ్రీ నటించారు. 1978లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సయీద్ జాఫ్రీ దిల్, కిషన్ కన్నయ్య, ఘర్ హో తో ఐసా, రాజా కీ ఆయేగీ బారాత్, దీవానా మస్తానా, మొహబ్బత్, జబ్ ప్యార్ కిస్ సే హోతా హై, ఆంటీ నెంబర్ 1, అల్బేలా, జుదాయి వంటి పలు హిట్ చిత్రాల్లో ఆయన నటించారు.
రిషీ కపూర్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, మాధురి దీక్షిత్, బెన్ కింగ్స్లే, నసీరుద్దీన్ షా వంటి పలువురు నటులతో ఆయన కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











