‘విశ్వరూపం’పై ఏపీ హైకోర్టులో రిట్ పిటీషన్
హైదరాబాద్: ముస్లింల మనో భావాలు దెబ్బతినే విధంగా ఉదంటూ కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ విధించడం, కమల్ హాసన్ మద్రాసు హై కోర్టును ఆశ్రయించగా..... చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించడం తెలిసిందే. తమిళనాడు మినహా అన్ని చోట్లా ఈ చిత్రం విడుదలై ప్రదర్శితం అవుతోంది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం 'విశ్వరూపం' చిత్రం ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ లో నిలిపి వేయాలని కోరుతూ నగరానికి చెందిన బిజినెస్ మేన్ మహ్మద్ హజి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ చిత్రం ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండటంతో పాటు, సామాజిక సామరస్యం దెబ్బతీసేలా ఉందని తన పిటీషన్లో పేర్కొన్నారు.
ముస్లింలకు వ్యతిరేకంగా, వారి మనో భావాలు దెబ్బతీసేలా ఉన్న 'విశ్వరూపం' చిత్రం ప్రదర్శన వెంటనే నిలిపి వేయాలా, సినిమాపై నిషేదం విధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డును, బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను ఆదేశించాలని మహ్మద్ హజి తన పిటీషన్లో కోర్టుకు విన్నవించారు.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. బ్యాన్ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్ట పోయింది.


Click it and Unblock the Notifications











