అనంత శ్రీరామ్ మాటలకే పవన్ కళ్యాణ్ స్పందన
హైదరాబాద్: వెంకటేష్తో తాను కలిసి నటించిన గోపాల గోపాల ఆడియో కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతా ఆధ్యాత్మికం గురించి, జీవిత పరమార్థం గురించే మాట్లాడాలని అనుకున్నట్లు ఆయన ధోరణి కనిపించింది. కానీ, మధ్యలో రాజకీయాలకు సంబంధించి ఓ మాట మాట్లాడి కలకలం సృష్టించారు. ఆడియో విడుదల వేడుకలో అనంత శ్రీరామ్ పవన్ కళ్యాణ్ కన్నా ముందు మాట్లాడురు. వెంకటేష్ గురించి మాట్లాడిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు పిచ్చి అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల పిచ్చి అనేదానికి అర్థం మారిపోయిందని అన్నారు. పవన్ కళ్యాణ్కు ఎనలేని అభిమానులు ఉన్నారని ఆయన చెప్పారు. వెంకటేష్కు తాను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పాట రాశానని ఆయన చెప్పారు. అయితే, తనను ఓ యువకుడు, ఓ వృద్ధుడు - "మాకు పవన్ కళ్యాణ్ అంటే మహా పిచ్చి, పవన్ కళ్యాణ్కు పాట రాయకూడదా అని అడిగార"ని ఆయన చెప్పారు.

గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్కు పాట రాశానని చెబుతూ ఆ పాటకు చెందిన రెండు లైన్లను ఆయన పాడి వినిపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేస్తారో... అంటూ రాజకీయాలను ఆ రకంగా ప్రస్తావించారు. ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పి వదిలేశారు.
ఆ తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన జీవితంలోని పలు సంఘటనలను వివరిస్తూ, తన అన్నయ్య చిరంజీవి తన జీవితాన్ని మార్చిన తీరును చెబుతూ రాజకీయాల గురించి అన్యాపదేశంగా చెప్పినట్లు చెప్పారు. వెంకటేష్, తాను ఎప్పుడూ ఆధ్యాత్మిక చర్చనే చేసుకుంటామని చెప్పారు. దేవుడి గురించి మాట్లాడుతూ - "రాజకీయాలా, ఉండనే ఉంటాయి, రాజకీయాలకు భుజం కాస్తా" అని అన్నారు. అనంత శ్రీరామ్ చెప్పినదానికి సమాధానం అని అనిపించకుండా ఆధ్యాత్మికం, సేవ, తన అభిమానుల ప్రతిస్పందన వంటి విషయాలు మాట్లాడుతూ ఆ విషయం చెప్పారు.


Click it and Unblock the Notifications











