పాలిటిక్స్: పవన్ కళ్యాణ్ అభిమానులకు గాలం?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యాడు. ఆయన ప్రచారం చేయడం వల్లనే తమ పార్టీలు విజయతీరాలకు చేరాయని మోడీ, చంద్రబాబు లాంటి వ్యక్తులు ప్రకటించడం కూడా ఇందుకు కారణం. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేవడంలో కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి దించడంలో ఉపకరించిందనేది వాస్తవం.
కేంద్రంలో బిజేపీ అధికారంలో వచ్చినప్పటికీ తెలుగునాట మాత్రం ఆ పార్టీకి బలం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఇక్కడ పుంజుకోవడం కోసం పవన్ కళ్యాణ్ సహాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్కు రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇచ్చే యోచనలో ఉందట.

పవన్ కళ్యాణ్ మోడీ కేబీనెట్లో పని చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానులు భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతారని ఆ పార్టీ భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పవన్ కళ్యాణ్ను చేర్చుకోవాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సన్నిహితుల్లో ఈ చర్చ జరుగుతున్నట్లు ఓ ఆంగ్ల అంతర్జాల పత్రికలో వార్తలు వచ్చాయి.
అయితే తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ప్రజల తరుపున వారి సమస్యలపై పాలకులను ప్రశ్నించడానికే వచ్చానని ముందు నుండీ చెబుతున్న పవన్ కళ్యాణ్....బీజేపీ తరుపున కేంద్ర మంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. చూద్దాం ఏం జరుగబోతోందో?


Click it and Unblock the Notifications











