పవన్ కళ్యాణ్ మూవీ అయితే పెంచేస్తారా.. OG టికెట్ ధరలపై అంబటి రాంబాబు ఫైర్
భారీ బడ్జెట్తో తెరకెక్కే పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచడంతో పాటు బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతిస్తున్నాయి. దీనిపై పలు విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తగ్గడం లేదు. దర్శక నిర్మాతలు, హీరోల అభ్యర్ధన మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా సుజిత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ టికెట్ ధరల పెంపు
ఓజీ టికెట్ ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పిస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి చెందిన నేతలు ఓజీ టికెట్ ధరల పెంపుపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఓ మీడియా సమావేశంలో ఓజీ టికెట్ ధరల పెంపుపై విమర్శలు గుప్పించారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఏపీలో బెనిఫిట్ షో టికెట్ ధర 1000 రూపాయలు
ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పెంపుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీ సినిమా టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఇందులో పేర్కొంది. బెనిఫిట్ షో టికెట్ ధరను 1000 రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్పై 125 రూపాయలు పెంచుకోవచ్చని, అలాగే మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్ ధరపై 150 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ బాటలో తెలంగాణ సర్కార్
ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతించింది. అలాగే ప్రీమియర్ షోల టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ఓజీ టికెట్ ధరను పెంచుకోవచ్చని తెలిపింది. అలాగే తెలంగాణలో ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 150 రూపాయలను అదనంగా పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
డిప్యూటీ సీఎం అయితే రేట్లు పెంచేస్తారా
ఈ నేపథ్యంలో ఏపీలో ఓజీ టికెట్ ధరల పెంపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మొట్టమొదటి రోజే 1000 రూపాయలట. ఫస్ట్ డే అభిమానులు కొంటారు.. అభిమానులు భరిస్తారు. మా జామకాయ అన్నట్లుగా ఉంది వ్యవహారం.. వాళ్ల ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించిన సినిమా.. వెయ్యి పెంచారు, ఇంకా రెండు వేలు పెంచనందుకు సంతోషించాలని అంబటి సెటైర్లు వేశారు. ఇది అధికార దుర్వినియోగమని, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించిన సినిమాకు మీరు 1000 రూపాయల టికెట్ పెట్టి షోలు వేస్తారా. పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటుంటే, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు సంపాదించుకుంటుంటే నేనేం కాదనను. ఉప ముఖ్యమంత్రిగారు నటిస్తే అంత కాస్ట్లీ టికెట్ ఎందుకు ఉంటుంది.. మీ ప్రభుత్వమైతే పెంచేసుకుంటారా, కొద్దో గొప్పో పెంచుకోండి తప్పులేదు.. 1000 రూపాయలా అని అంబటి ప్రశ్నించారు.
మిరాయ్కి ఎందుకు పెంచలేదు
ఓజీ మీద మాకు కడుపు మంట లేదు, ఓజీ బ్రహ్మాండంగా ఆడాలి.. దానయ్య గారికి దండిగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. సినిమాకు దండిగా డబ్బులు ఎప్పుడొస్తాయి? సక్సెస్ అయితేనే, కానీ సక్సెస్ కాకపోయినా దండిగా డబ్బులు రావాలని చూస్తున్నారు.. ఇది తప్పు, అన్యాయం. సినిమా అనేది ప్రజలకు వినోద సాధనం, ఈ రకంగా జీవోలు రిలీజ్ చేయడం దుర్మార్గం కాదా అని రాంబాబు నిలదీశారు. 164 సీట్లు ఉన్న మిమ్మల్ని మేం అడ్డుకోలేం.. ఇది దోపిడియే, ఇలాంటివి మంచిది కాదు. మిరాయ్ అద్భుతంగా ఉంది, మరి ఆ సినిమాకు ఎందుకు పెంచలేదని ఆయన ప్రశ్నించారు. అంబటి వ్యాఖ్యల నేపథ్యంలో ఓజీ వర్గాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











