'అమ్మ చెప్పింది' బాగానే....

సినిమా: అమ్మ చెప్పింది
విడుదల తేదీ: 28-07-2006
నటీనటులు: శర్వానంద్, శ్రియారెడ్డి, సుహాసిని,
పవన్ మల్హోత్రా, కృష్ణభగవాన్, తనికెళ్ల భరణి,
ఎల్బీ శ్రీరామ్, నాగేంద్రబాబు తదితరులు
కెమెరా: సందీప్ గుణ్ణం
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
కథ, మాటలు, కొరియోగ్రఫీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గంగరాజు గుణ్ణం
నిర్మాత: ఊర్మిళా గుణ్ణం, కె. ఆర్. శాయి
ఎప్పుడో 'లిటిల్ సోల్డర్స్'.. మళ్లీ ఇన్నాళ్లకు 'అమ్మ చెప్పింది'తో రెగ్యులర్ మాస్ జపానికి ఎదురీదితే తెరపైకి వచ్చారు గంగరాజు. కొత్తదనం, క్రియేటివిటీతో నిండిన సీన్లు పండినా స్క్రీన్ప్లే సరిగ్గా లేకపోవడం మైనస్గా నిలిచింది. అయినా పండిన కామెడీ క్లైమాక్స్లో ఎమోషన్స్లో కన్నీరు పెట్టించడం బాక్సాఫీసుకు కొంత ఊరట. ఒక రకంగా కొత్త తరానికి ఆహ్వానించదగ్గ డిఫరెంట్ సినిమా.
టైటిల్ను జస్టిఫై చేసే ఈ కథ బోస్ (శర్వానంద్) అనే మానసిక ఎదగని కుర్రోడికి అతని తల్లి (సుహాసిని)కి మధ్య అనుబంధాన్ని స్పృశిస్తూ సాగుతుంది. బోస్ తండ్రి (పవన్ మల్హోత్రా) రాకెట్ కేంద్రంలో చీఫ్ సైంటిస్టు. తమ్ముడు చందు, తల్లి కాలనీ జనం అతని పరిమిత ప్రపంచం. అనుకోకుండా ఐయస్ఐ కన్ను రాకెట్ కేంద్రంపై పడటంతో అతని జీవితం అల్లకల్లోలం అవుతుంది. తండ్రి పని చేసే ఆఫీసులోకి సెక్యూరిటీ చెక్ లేకుండా వెళ్లగలటంపై ఆధారపడి ఐయస్ఐ వ్యూహం రచిస్తుంది. దానిలో భాంగా ఏజెంట్లు (నాగేంద్రబాబు) రంగంలోకి దిగి బోస్ని బుట్టలో పడేస్తాడు. ఈలోగా రజియా (శ్రియారెడ్డి) అనే ఐబి ఆఫీసరు ఈ కుట్రను ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. వీటి మధ్యలో ఇరుక్కున్న బోస్ పరిస్థితి ఏమైంది? చివరికి ఆ రాకెట్ కేంద్రం ఎలా రక్షింపబడింది? బోస్కి ఆ తల్లి ఏమి చెప్పిందనేది కళ్లు చెమర్చే క్లైమాక్స్ తెరపై చూడాల్సిందే.
ఫస్టాఫ్ తల్లీకొడుకుల అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే సెకండాఫ్ దాన్ని పే ఆఫ్ చేయాలని దర్శక రచయిత ప్రయత్నం. కానీ కథలో కీలకమైన ఐయస్ఐ వ్యూహం ఫస్టాప్లో ఎస్టాబ్లిష్ చేయకపోవంతో స్క్రీన్ టైమ్ గడుస్తున్నా కథ వేడెక్కలేదు. ఆ వ్యూహానికి సంబంధించిన సీన్లన్నీ సెకండాఫ్లో ఒకేసారి వేయడంతో కథనం డ్రైగా మారింది. అలాగే ఫస్టాఫ్ స్క్రీన్ టైమ్ చాలా కాలం జరిగినట్లు చూపి సెకండాఫ్ మొత్తం ఒక గంట (టైమ్ లాక్)లో జరిగినట్లు చూపెట్టడం సరిగా కుదరలేదు. ఇది స్క్రీన్ప్లే లోపం. దానితో పాటు కథలో కీలకమైన కారుబాంబు పేలటంతో కాలనీ మొత్తం బోస్ గురించి ఆందోళనపడినా తల్లివైపు నుండి రిజిష్టర్ కావాల్సిన ఎమోషన్స్, ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటనేది చూపలేదు. అలాగే బోస్ ద్వారా బాంబుని రాకెట్ కేంద్రంలో చేర్చడం సరిగా చూపలేదు. దాంతో కాలనీవాసులు తప్పు పట్టే సీను కొద్దిగా ఇబ్బంది అయింది. క్లైమాక్స్ బోసుకి తానేమి చేయబోతున్నాడనే విషయాన్ని కొంత తెరిచి సస్పెన్షన్లో వుంచారు. దాన్ని పూర్తిగా మూసి కొసమెరుపుగా పేలిస్తే మరింత సెంటిమెంట్ పండేది. ఇలా స్క్రిప్టులో కొద్దిగా లోపాలున్నా క్రియేటివిటిలో దర్శకుడు చాలా ముందు వరసలో వుండడం అభినందనీయం. కొత్త తరం దర్శకులు నేర్చుకోవాల్సిన విషయం. ప్రతి సీనులో అండర్ కరెంట్గా ఫీల్ని, హ్యూమన్ని ఇమిడ్చి స్క్రిప్టును తయారు చేయడంలో ఆయన కృషి ప్రశంసనీయంగా కనబడుతుంది. శ్రియారెడ్డిని ఆంటీ అని హీరో పిలవడం సీతాకోక చిలుక ఎపిసోడ్ క్లైమాక్స్, హీరో క్యారెక్టరైజేషన్ అద్భుతంగా నిలిచాయి.
పాటల్లో రెండు హృదయానికి హత్తుకునే విధంగా వుండడం దర్శకుని మంచి మ్యూజిక్ టేస్టుకు నిదర్శనం. కెమెరా కొత్తవాడైనా గమ్మత్తుగా నీడలను పట్టుకుని కథ లోతుల్లోకి తీసికెళ్లాడు. ఇదే కెమెరా ఇంటర్వెల్ తర్వాత వచ్చే పాటలో తల్లీకొడుకుల ఫీల్ మధ్యలోకి దూరి ప్రయోగం చేయబోయి అభాసు పాలు కావడం గమనించదగింది. ఎడిటింగ్ కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టింది. రీరికార్డింగ్, కథనం మరింత పకడ్బందీగా ఉంటే బాగుండేది. మనసెదగని కుర్రోడిగా శర్వానంద్ క్యారెక్టర్లో ఇమిడిపోయిన తీరు అతనికి భవిష్యత్తు ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. పవన్ మల్హోత్రా, సుహాసిని, కృష్ణభగవాన్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ ఎప్పటిలాగే ఎక్కడా వొంక పెట్టలేని రీతిలో నటించారు. శ్రియారెడ్డి కొన్ని చోట్ల కృత్రిమంగా ఉన్నట్లు అనిపించినా మొత్తం మీద బాగా నటించింది. ఇలా ఈ సినిమాలో ఎన్ని ప్లస్లు ఉన్నా రెగ్యులర్ ప్రేమ, ఫ్యాక్షన్ కథ కాకపోవడం తెలుగు ప్రేక్షకులకు రుచిస్తే మరో మాతృభవోదేవలాగా థియేటర్లు ఫ్యామిలీలతో నిండుతాయి. ఇది ఒక రకంగా బిట్టర్ స్వీట్ సినిమా.
గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్కు సంబంధం ఉండనవసరం లేదు.


Click it and Unblock the Notifications











