భక్తులకు మాత్రమే....(శిరిడి సాయి రివ్యూ)
---సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్: 2/5
సంస్థ: సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.
తారాగణం: నాగార్జున, శ్రీకాంత్, శ్రీహరి, సాయికుమార్, కమలినిముఖర్జీ, తనికెళ్ల భరణి, శరత్బాబు, రోహిణి హట్టంగడి, వినయప్రసాద్, సాయాజీ షిండే, దేవేంద్ర దోడ్కే, బ్రహ్మానందం, కౌశిక్బాబు తదితరులు
సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
సంగీతం:కీరవాణి
కళ: భాస్కరరాజు, శ్రీకాంత్
నిర్మాత: ఎ.మహేష్రెడ్డి
కెమెరా: ఎస్.గోపాల్రెడ్డి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
విడుదల:06,సెప్టెంబర్ 2012.
బాగా పాపులర్ అయిన కథలను తెరకెక్కించడంలో ఓ రిస్క్ ఉంది..అప్పటికే తెలిసి ఉన్న కథను ఎంతో ఇంట్రస్ట్ గా చెప్తే తప్ప ఆసక్తిగా ఉండదు. అయితే ఇలాంటి కథల్లోనూ భక్తి చిత్రాలకు ఓ మినిహాయింపు ఉంది. సినిమా ఎలాగున్నా చూద్దామనుకుని ప్రిపైరన మినిమం ప్రేక్షకులు ఉంటారు. అందులోనూ గతంలో శ్రీరామదాసు, అన్నమయ్య ఇదే కాంబినేషన్ లో వచ్చి విజయవంతమవటంతో మంచి క్రేజే వచ్చింది. అయితే దాన్ని వినియోగించుకున్నారా లేదా అనేది ప్రక్కన పెడితే...బయోపిక్ తరహాలో నిజ జీవిత కథను తెరకెక్కిస్తున్నట్లుగా కాకుండా రెగ్యులర్ కమర్షియల్ బాణీలో విలన్, కామెడీ అంటూ పరుచూరి వారి స్క్రిప్టుతో వచ్చిన ఈ చిత్రం బాబా భక్తులకు నచ్చితే మంచి విజయం సాధిస్తుంది.
తెలిసిన కథే మళ్లీ చెప్పుకుంటే 1854లో దత్తాతత్రేయుడు అవతారంగా సాయిబాబా ఉద్భవిస్తాడు. ఆయన తన పదహారోయేట శిరిడికి వస్తారు. అక్కడి వేప చెట్టు కింద కూర్చొంటారు. ఆయన తేజస్సుకి ఆకర్షితులైన ఊరి జనాల్ని చూసి ఆ ఊళ్లో పెద్ద మనిషి భాటియా(షాయేజీ షిండే)కి అసూయ వస్తుంది. అక్కడ నుంచి బాబాపై పగబట్టి ఆ ఊరునుంచి పంపేస్తాడు. ఆ తర్వాత మళ్లీ కొంత కాలానికి సాయిబాబా(నాగార్జున)గా అదే ఊరికి వస్తాడు. అప్పుడు మళ్లీ భాటియా పగని కంటిన్యూ చేస్తాడు. ఆయన్ని అన్ పాపులర్ చేసి, ఆ ఊరు నుంచి తరమటానికి ప్రయత్నం చేస్తూంటాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా సబ్ కా మాలిక్ ఏక్ అనే సందేశాన్ని భోదిస్తూ తన ప్రస్దానం కొనసాగిస్తూంటాడు. ఆ క్రమంలో బోధనలు, మహిమలతో బాబా సమాధి అవటం వరకూ ఈ చిత్రం సాగుతుంది.
పరుచూరి బ్రదర్స్ రాసిన ఈ సినిమా స్క్రిప్టు బాబా సచ్ఛరిత్రను (హేమండ్పంత్తో బాబా దగ్గరుండి రాయించుకున్నట్లుగా చెప్పబడుతున్న) ఆధారం చేసుకునే తయారు చేసారు. అయితే కొన్ని లోతుగా వెళ్లి చెప్పాల్సిన విషయాలు వదిలేసారనిపిస్తుంది. ముఖ్యంగా బాబా మహిమలను హైలెట్ చేసినట్లుగా ఆయన చెప్పే ఆధ్యాత్మిక భోదనలకు ప్రయారిటీ ఇవ్వలేదు. బాబాతో ఆ కాలం నాటి భక్తులు అనుభవాలు కూడా కలిపి ఉంటే మరింత నిండుతనం వచ్చి ఉండేది. అలాగే సినిమాను ఏ కాలంలో, ఎక్కడ ఎప్పుడు జరుగుతోంది...ఆ కాలం నాటి పరిస్ధితులు, కథ జరిగే నాటి ప్రాంత వాతారణం మరింత బాగా క్రియేట్ చేసి ఉండాల్సిందనిపిస్తుంది. ఇక నాగార్జున ఏ సినిమా అయినా ఒకటే అన్నట్లుగా చేసుకుంటూ పోయిన ఈ చిత్రం మాత్రం భక్తుల కోసమే అన్నట్లు కనిపిస్తాడు. అలాగే సాయిబాబా...మాటలు ఎక్కువగా వేదాంత తత్వంతో ఉంటాయి. చాలా మందికి తెలిసిన వాటిని సినిమాటెక్ గా మార్చేయటం కాస్త చిత్రంగా ఉంటుంది. ఇక ఫస్టాఫ్ బాగా నడిచిన ఈ చిత్రం సెకండాఫ్ ముఖ్యంగా క్లైమాక్స్ డల్ గా అనిపిస్తుంది. కమర్షియాలిటి కోసం కామెడీ ట్రాక్, విలన్ ట్రాక్ పెట్టినా అవి కాస్త మితిమీరాయని అనిపిస్తుంది. ఇక బాబా మూడు రోజులు పాటు శరీరాన్ని వదిలి మళ్లీ రావటానికి కారణం ఇస్తే ఆ ఎపిసోడ్ మరింత నిండుతనం వచ్చేది.
హైలెట్స్ లో బాబా జననం నుంచి జీవ సమాధి వరకూ ఉన్న అన్ని దశలనూ స్పృశించం బాగుంది. అలాగే ఈ కాలానికి అత్యవసరమైన మతసామరస్యం, సబ్ కా మాలిక్ ఏక్ అనే విషయాన్ని నొక్కి చెప్పగలిగారు. మనిషికి ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది అంటే మరణం తర్వాత వంటి కొన్ని డైలాగులు సినిమాకు నిండుతనం తెచ్చాయి. అలాగే బాలగంగాధర్ తిలక్ వచ్చి బాబాను కలిసే ఎపిసోడ్, గాంధీ వచ్చి స్వాతంత్ర్యం తెచ్చి పెడతాడని బాబా చెప్పడం బాగున్నాయి. రాధాభాయిగా కమలిని ముఖర్జీ బాగా చేసింది. నటీనటుల్లో దాసగణు (శ్రీకాంత్), వేల్స్ (శ్రీహరి), మహల్సాపతి (శరత్బాబు), నానావళి (సాయికుమార్) లాంటి పాత్రలు బాగానే పండాయి. సంగీతం మాత్రం బాగా నిరాశపరిచింది. దానికి కారణం..గతంలో ఇదే కథతో వచ్చిన విజయచందర్ చిత్రంలో పాటలు పెద్ద హిట్ అవటం కూడా ఓ కారణం కావచ్చు. అలాగే మరాఠి నుంచి కొన్ని భజనలు తీసుకుంటే బావుండేది.
ఏదైమైనా బాబా భక్తులను టార్గెట్ చేస్తూ తీసిన ఈ చిత్రం వారికి నచ్చటం మీదే విజయం ఆధారపడి ఉంటుంది. భక్తులు కాని వారు మాత్రం బాబా బయోపిక్ చూద్దామని వెళితే మాత్రం నిరాశపడతారు.
(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


Click it and Unblock the Notifications











