Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Veera Simha Reddy review టార్గెట్ వైఎస్ జగన్ సర్కార్.. డైలాగ్స్తో చీల్చి చెండాడిన బాలకృష్ణ!
అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, క్రాక్ సినిమా భారీ సక్సెస్ తర్వాత మలినేని గోపిచంద్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్, యాక్షన్, థ్రిల్లర్ వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు సిద్దమైంది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు భారీ క్రేజ్ను పెంచాయి. ఇలా భారీ అంచనాలతో వచ్చిన వీరసింహరెడ్డి ఏం రేంజ్లో నందమూరి అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందానే విషయంలోకి వెళితే..
వీరసింహారెడ్డి కథ ఏమిటంటే?
కర్నూలులోని పులిచర్ల ప్రాంతంలో ఫ్యాక్షన్ అరాచకాలు, పగ, ప్రతీకారాలకు వ్యతిరేకంగా వీరసింహారెడ్డి (బాలకృష్ణ) కత్తి పడుతాడు. తన సోదరి భానుమతి (వరలక్ష్మీ), ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) దంపతులతో వైరం కొనసాగుతుంటుంది. ప్రతాప్ రెడ్డి తనను చంపడానికి ప్రయత్నించినప్పటికీ.. చెల్లెలిపై ప్రేమ కారణంగా బావను క్షమించి వదిలేస్తుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరసింహారెడ్డికి తన జీవిత భాగస్వామి మీనాక్షి (హనీ రోజ్), జై సింహారెడ్డి (బాలకృష్ణ) దూరంగా ఇస్తాంబుల్లో బతుకుతుంటారు. చాలా ఏళ్ల తర్వాత తన ఫ్యామిలీని కలుసుకొనేందుకు ఇస్తాంబుల్కు వెళ్లిన వీరసింహారెడ్డిని టార్గెట్ చేసి భానుమతి, ప్రతాప్ రెడ్డి దాడి చేస్తారు.
వీరసింహారెడ్డి సినిమాలో ట్విస్టులు
వీరసింహారెడ్డిపై చెల్లెలు భానుమతి ఎందుకు విద్వేషం పెంచుకొన్నది? వీరసింహారెడ్డితో భానుమతి బంధం ఎలాంటింది? వీరసింహారెడ్డికి జీవిత భాగస్వామి మీనాక్షి ఎందుకు దూరంగా బతుకుతుంది? ఏ పరిస్థితుల్లో వీరసింహారెడ్డి రాయలసీమను వదిలేసి ఇస్తాంబుల్ వెళ్లాల్సి వచ్చింది. ఇస్తాంబుల్లో వీరసింహారెడ్డిని కలిసిన కుమారుడు జై సింహారెడ్డి ఆలోచనల్లో మార్పుకు ఎలాంటి సంఘటన కారణమైంది? ఇషా (శృతిహాసన్), జై సింహారెడ్డి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది? తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ముందడుగు వేసిన జై సింహారెడ్డికి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? తన అన్న వీరసింహారెడ్డికి ద్రోహం చేసిన భానుమతి ఎలాంటి శిక్షను విధించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే వీరసింహారెడ్డి సినిమా కథ.
ఫస్టాఫ్ ఫుల్ ఎనర్జీతో
ఇస్తాంబుల్లో జై సింహారెడ్డి, తన తల్లి మీనాక్షి మధ్య ఓ పవర్ఫుల్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. రిచర్డ్ అనే విదేశీయుడు తన వ్యాపారాన్ని టార్గెట్ చేసే క్రమంలో జై సింహా ఎంట్రీ అదిరిపోతుంది. ఆ తర్వాత వీరసింహారెడ్డి ఎంట్రీ తర్వాత కథ జెట్ స్పీడ్తో ఇంటర్వెల్ వరకు ముందుకెళ్తుంది. ప్రతాప్ రెడ్డి, హోం మినిస్టర్ (రవిశంకర్) మధ్య అభివృద్ధికి సంబంధించిన సన్నివేశం, అలాగే రాయలసీమ గురించి వీరసింహారెడ్డి చెప్పే డైలాగ్స్ సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. ఓ షాకింగ్ ఎపిసోడ్తో ఫస్టాఫ్ ఎమోషనల్, హై ఓల్టేజ్ యాక్షన్ సీన్తో ముగుస్తుంది.
హై ఎమోషన్స్తో సెకండాఫ్
ఇక సెకండాఫ్లో భానుమతి, వీరసింహారెడ్డికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ మరింత ఎమోషనల్గా సాగుతుంది. హానీ రోజ్తో వీరసింహారెడ్డి సహజీవనం లాంటి సన్నివేశాలు గ్రిప్పింగ్గా సాగుతాయి. తండ్రి ఆశయం కోసం కత్తిపట్టాలని నిర్ణయించుకొన్న తర్వాత సినిమా కథ మరింత పీక్స్లోకి వెళ్తుంది. అదే ఊపులో భానుమతిగా వరలక్ష్మీ శరత్ కుమార్.. పవర్ఫుల్ ఫెర్పార్మెన్స్తో సినిమాకు మరింత ఎనర్జీ తెచ్చిపెట్టడమే కాకుండా కథను ఫీల్గుడ్ మార్చుతుంది. క్లైమాక్స్లోని సన్నివేశాలు హార్ట్ టచ్ చేస్తాయి.
రొటీన్, రెగ్యులర్ పాయింట్తో గోపిచంద్ మ్యాజిక్
దర్శకుడు మలినేని గోపిచంద్ ఎంచుకొన్న పాయింట్ రెగ్యులర్, రొటీన్. ఇప్పటి వరకు ఇలాంటి ఫ్యాక్షన్ కథలు కోకొల్లలుగా వచ్చి ఉంటాయి. కానీ రెగ్యులర్ పాయింట్ను కథగా విస్తరించి.. ఎమోషనల్ సన్నివేశాలు, భారమైన పాత్రల మధ్య డ్రామాను క్రియేట్ చేయడంలో గోపిచంద్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథ అయినప్పటికీ.. స్క్రీన్ ప్లేతోపాటు పవర్ఫుల్ డైలాగ్స్తో కథను, సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్లడంతో హిట్ రేంజ్ను దాటించే ప్రయత్నం చేశారు. మాస్ మసాలా, కమర్షియల్ అంశాలతో మరో హిట్ను కెరీర్లో సునాయసంగా వేసుకొన్నాడని చెప్పవచ్చు.
బాలయ్య మరింత పవర్ఫుల్గా
ఇక నందమూరి బాలకృష్ణ డబుల్ రోల్, ఫ్యాక్షన్ సినిమాలు కొత్తేమీ కాదు. తండ్రి కొడుకులుగా రెండు పాత్రలను హై ఎనర్జీతో, చక్కటి హావభావాలు, యాటిట్యూడ్తో బాలయ్య తెరమీద అద్బుతంగా పండించాడు. సిస్టర్ సెంటిమెంట్ సీన్లలో, ఇస్తాంబుల్లో ఇంటర్వెల్ సీన్లో బాలయ్య ఫెర్ఫార్మెన్స్ అభిమానులను వెంటాడుతుంటుంది. తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ తూటాలుగా పేలాయి. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. తన డైలాగ్స్, తన మార్కు ఫెర్ఫార్మెన్స్తో చీల్చి చెండాడనే చెప్పవచ్చు. మరోసారి సంక్రాంతి రేసులో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని వీరసింహారెడ్డి మూవీతో క్లారిటీ ఇచ్చారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం
ఇక వీరసింహారెడ్డి చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ పాత్రలు కీలకంగా మారాయి. శృతి హాసన్ గ్లామర్పరంగా ఆకట్టుకొనేందుకు ప్రయత్నించి.. పాటలు, డ్యాన్సులతో సరిపెట్టుకొన్నది. ఇక మలయాళ నటి హనీ రోజ్ ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ భానుమతి పాత్రతో విశ్వరూపం చూపించింది. కీలక సన్నివేశాల్లో పవర్ఫుల్ ఫెర్పార్మెన్స్తో కథను మొత్తం తన భుజాల మీద మోసిందా అనే సందేహం కలుగుతుంది. ఇక దునియా విజయ్ డిఫరెంట్ విలనిజం ప్రదర్శించాడు. మాస్ పాత్రలో దునియా విజయ్ తన మార్కు నటనను ప్రదర్శించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.
పవర్ఫుల్గా బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్
వీరసింహారెడ్డి చిత్రంలోని సాంకేతిక విభాగాలు పనితీరు విషయానికి వస్తే.. ఈ కథకు, సినిమాకు డైలాగ్స్ ప్రాణం పోసాయి. సరైన డైలాగ్స్ లేకుంటే ఈ సినిమాకు ఇంత రేంజ్ వచ్చేది కాదు. బుర్రా సాయిమాధవ్ రాసిన మాటలు పెన్నుతో కాకుండా గన్నుతో పేల్చినట్టు రాశాడు. ఇటీవల కాలంలో ఇంత ఎనర్జీ, పవర్ఫుల్, పొలిటికల్ పంచులు ఉన్న సినిమా చూడటం కొత్తగా అనిపిస్తుంది. భోసిడికే నుంచి అనేక సందర్భాల్లో ఏపీ గవర్నమెంట్ను టార్గెట్ చేయడంలో బుర్రా పెన్ను పదునెక్కింది. ఈ పవర్కు కారణం రాగి సంకటి.. నాటు కోడి పలుసు, మీరు సవాల్ విసిరితే.. నేను శవాలు విసురుతాను. రాయలసీమ గురించి చెడుగా మాట్లాడితే.. పీక కోస్తాను. దేశానికి రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ.. ఏపీకి 5 గురు ముఖ్యమంత్రులను ఇచ్చింది.. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడికి అండగా నిలిచింది.. ఏపీని ప్రపంచపటంలో పెట్టిన గొప్ప విజనరీని ఇచ్చింది రాయలసీమ.. ఇది రాయల్ సీమ అంటూ సాయిమాధవ్ చెలరేగిపోయాడు. రాష్ట్ర అభివృద్దిపై బాలయ్యతో వేయించిన సెటైర్లకు చప్పట్లు పడ్డేలా చేశారు.
తమన్ మరోసారి బీజీఎంతో దడదడ..
ఇక తమన్ ఎప్పటి మాదిరిగానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తోనే కాకుండా పాటలతో అదరగొట్టాడు. సుగుణ సుందరి, బావ మనోభావాలు ఆడియోపరంగానే కాకుండా తెర మీద అందంగా ఆవిష్కరించడంలో సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ తన ప్రతిభను చాటుకొన్నారు. యాక్షన్ సీన్లను ప్రేక్షకులకు జోష్ పుట్టించేలా రిషి పంజాబీ హై ఎనర్జీతో చిత్రీకరించాడు. నవీన్ నూలి ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. ముఖ్యంగా రెగ్యులర్ కథను నమ్మి.. సినిమాను కొత్తగా ప్రజెంట్ చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్గా వీరసింహారెడ్డి ఎలా ఉందంటే?
సంక్రాంతి పండుగ సెలవులను, ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ హంగులు, బాలకృష్ణకు కలిసొచ్చే ఫ్యాక్షన్ కథతో రూపొందిన చిత్రం వీరసింహారెడ్డి, అన్నాచెల్లెల్ల అనుబంధం, పుట్టిన గడ్డపై శాంతి నెలకొల్పడానికి కత్తి పట్టి రుద్రతాండవం చేసిన రాయలసీమ బిడ్డ కథగా తెరకెక్కింది. లాజిక్స్కు దూరంగా, వాస్తవానికి భిన్నంగా.. కేవలం సినీ ప్రేక్షకుల అభిరుచిని, అభిమానుల ఇగోను సంతృప్తి పరచడానికి రాసుకొన్న సన్నివేశాలు వీరసింహారెడ్డికి అదనపు బలంగా మారాయి. కత్తిపట్టి నరకడమనేది బాలకృష్ణకే చెల్లుతుందని మరోసారి నిరూపించే చిత్రం ఇది. మాస్, మసాలా, యాక్షన్, సెంటిమెంట్, క్యారెక్టర పరంగా హీరోయిజం ఇష్టపడే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటింది. సంకాంత్రి సీజన్లో రికార్డులు తిరగరాసే కలెక్షన్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. బాక్సాఫీస్ పరంగా ఏ రేంజ్ హిట్ అనేది కొద్ది రోజులు ఆగితే స్పష్టమవుతుంది.
వీరసింహారెడ్డిలో నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నవీన్ చంద్ర, పీ రవిశంకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, చంద్రిక రవి, సప్తగిరి తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నీని, రవిశంకర్ వై
సినిమాటోగ్రఫి: రిషి పంజాబీ
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్: ఎస్ థమన్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2023-01-12