మరీ ఇలా ఉంటే ఒక్కడే వస్తాడు...ప్రేక్షకుడు ('ఒక్కడొచ్చాడు' రివ్యూ)
విశాల్, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన 'ఒక్కడొచ్చాడు' చిత్రం ఓ రొటీన్ ..యాక్షన్ కామెడీ మాత్రమే. ఎంటర్టైనర్ అంటే ఒప్పుకునే పరిస్దితి లేదు.
విశాల్ సినిమాలంటే ఒకప్పుడు తమిళంలోనే కాదు... తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. ఒకప్పుడు అంటే పందెంకోడి సినిమాతో హిట్ కొట్టినప్పుడు అని చెప్పాలి. ఆ తర్వాత అలాంటి సినిమా మరొకటి అతని నుంచి రాలేదు. ఎప్పటికప్పుడు పందెం కోడి లాంటి సినిమానే చూడండి..పందెం అన్నట్లు స్టేట్ మెంట్స్ ఇచ్చి...అద్బుతం జరిగిపోతోందంటూ బిల్డప్ ఇచ్చి..ఫైనల్ గా ఓ రొటీన్ మాస్ సినిమా తో ధియోటర్ లో దిగటం కామన్ అయ్యిపోయింది.
అక్కడితో ఆగకుండా అరవ వాసన కొట్టే ఆ తమిళ సినిమాలను...తెలుగులో డబ్బింగ్ చేసి వదలటం...అది తుస్సుమనటం జరుగుతోంది. ఈ సారి కూడా అలాంటి ఓ కాన్సెప్టు నే ఎత్తుకుని, కామెడీతో కుమ్మేస్తున్నా..వడివేలుని సాయిం తెచ్చుకున్నా, తమన్నాతో గ్లామర్ ఒలకపోయించా అంటూ ఓ రేంజిలో ప్రచారం చేసి వచ్చాడు విశాల్.
అయితే ఈ చిత్రం చూసాక అర్దం అవుతుంది..విశాల్ ఏ మాత్రం మారలేదు. తన వరస ఫ్లాఫ్ ల నుంచి ఏమీ నేర్చుకోలేదు. భాక్సాఫీస్ ని గెలవటానికి గజనీ తరహాలో విశాల్ చేస్తున్న మరో దండయాత్ర మాత్రమే ఈ సినిమా అని.
నిజ జీవితంలో.. నడిగర్ సంగం ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి విశాల్ శైలి మారింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికెళ్లి స్పందిస్తున్నాడు. కానీ సినిమాలను మార్చుకునే మైండ్ సెట్ మాత్రం మార్చుకోలేదు.

యాభై కోట్లు రికవరీ..
డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక సాహసం నిండిన తెలివైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) అనే నేరస్దుడు నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. ఆ రికవరీకు సినిమా కథకు లింక్ ఉంటుంది.

తమన్నాతో లవ్
అర్జున్ (విశాల్) పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి.. సైకాలజీ స్టూడెంట్ అయిన దివ్య (తమన్నా)ను ప్రేమిస్తాడు. ఆమె డీసీపీ చంద్రబోస్ (జగపతిబాబు)కు చెల్లెలు. ఒకసారి వారిద్దరిని రెస్టారెంట్లో చూస్తాడు అన్న చంద్రబోస్ . తమ ప్రేమ వ్యవహారాన్ని సోదరుడితో చెప్పుకుంటుంది దివ్య.

కిడ్నాప్ కు గురి అవుతాడు...
తన చెల్లిని ప్రేమించిన అర్జున్ కు అనేక రకాలుగా పరీక్షలు పెట్టి చివరికు తన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు డీసీపి. ఈ లోగా అతను కిడ్నాప్కు గురవుతాడు. దాన్నుంచి అతన్ని విడిపించిన అర్జున్ అనుకోని విధంగా ఓ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటన్నది ఇంటర్వెల్.

ఓ మంత్రి జోక్యం..
దాని పర్యవసానం అర్జున్కి గతం గుర్తుండదు. అతనికి గతాన్ని గుర్తు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు డీసీపి. ఇంతలోనే ఓ మంత్రి (జెపి) జోక్యం చేసుకుంటాడు. విషయం మంత్రిదాకా ఎందుకు వెళ్లింది అంటే...వీళ్లందరికీ మధ్య ఉన్న ఒకే ఒక్క కామన్ విషయం డబ్బు.

అర్జున్ మిషన్ ఏంటి
ఈ లోగా డీసీపీ నేరస్థుల నుంచి రికవర్ చేసిన వందల కోట్ల డబ్బును కొట్టేస్తాడు. అప్పుడే అర్జున్ లక్ష్యం వేరే అని తెలుస్తుంది. ఇంతకీ అర్జున్ ఎవరు.. అతడి మిషన్ ఏంటి.. కొట్టేసిన డబ్బుతో అతనేం చేస్తాడు అన్నది మిగతా కథ.

పల్లెతో విశాల్ కు సంభంధం
ఇంతకీ ఆ డబ్బు ఎక్కడిది? ఎవరిది? దాంతో వీళ్లందరికీ ఏం పని? అర్జున్కి, మారుమూల ఉన్న పల్లెటూరికి ఏంటి సంబంధం వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

రైతులు కథ
ఈ సినిమా కథలో అసలు దర్శకుడు చెప్పే మేసేజ్ లేదా కాన్సెప్టు ఏమిటి అంటే.. ఓ రైతు తన గ్రామం కోసం రాబిన్ హుడ్ గా మారతాడు. అతను తన గ్రామానికి అన్యాయం చేసి డబ్బులు సంపాదించిన వారి నుంచి దోచేస్తూంటాడు. ఆ డబ్బుతో తన గ్రామాన్ని డవలప్ చేస్తాడు. రైతుకు అన్యాయం చేస్తే ఊరుకోననే సందేశం చెప్తారు.

ట్రీట్ మెంట్ దగ్గరే
పాయింట్ గా ఈ సినిమా కథ ని చూస్తే బాగానే ఉంటుంది. విలేజ్ లకు అన్ని వసతులను సమకూర్చామని ప్రభుత్వానికి లెక్కలు చూపించి, ఆ సౌకర్యాలను పేపర్లకు పరిమితం చేసి, కోట్లకు కోట్లు పోగేస్తున్న రాజకీయనాయకులను ప్రశ్నించడానికి అల్లుకున్న పాయింట్ బావుంది. అయితే ట్రీట్ మెంట్ కు వచ్చేసరికే దెబ్బ కొట్టింది.

ఎడ్జ్ ఆఫ్ ది సీట్
కెమెరా వర్క్ సినిమాకు హైలైట్. ఛేజింగ్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిపిస్తాయి. కార్ ఛేజింగ్ సీన్ ఎవరినైనా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ని రప్పిస్తుంది. పల్లెటూర్లలో ఆత్మగౌరవంతో బతికిన రైతులు, పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు రావడానికి గల కారణాలను హృద్యంగా స్పృశించారు కానీ సినిమాకు ప్లస్ కాలేదు.

స్క్రీన్ ప్లే కూడా మైనస్
ఈ సినిమా కు పెద్ద మైనస్ ..ఫస్ట్ హాఫ్ లో అసలు కథే లేకుండా నడపటం. కేవలం మరో పదినిముషాలలో ఇంటర్వెల్ వస్తుందనగా సినిమా అసలు స్టోరీలోకి వెళ్ళింది. అంతవరకూ సినిమాని ఏదో విధంగా నడపాలి కాబట్టి లాగటం మొదలెట్టారు. అలా రొటీన్, బోరింగ్ సన్నివేశాల్ని బలవంతంగా ఇరికించారు. కథ పాత సినిమా తరహా కథే అయినా స్క్రీన్ ప్లే లో కొత్తదనం ఎమన్నా ఉందా అంటే అది కూడా లేకుండా పోతుంది.

పాటల కోసమే..
ఇక సెకండ్ హాఫ్ లో మరీ దారుణం...హీరోయిన్ తమన్నా ఒక పాట, మూడు సీన్ లో తప్ప ఇంకెక్కడా కనిపించదు. ఆమెను కేవలం పాటల కోసమే తీసుకున్నారా అనిపించింది.

బోర్ కొట్టింది
మొదటి నుంచీ చెప్తున్నట్లుగా... వడివేలు కామెడీ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించారు కానీ వడివేలు కామెడీ కొంత సేపు బాగానే ఉన్నా ఆ తరువాత కథకు సంబంధం లేకుండా పోతూ బోర్ కొట్టించింది. ఇక కథనంలోకి బలవంతంగా జొప్పించిన పాటలు బోరింగ్ సినిమాని మరింత చిరాకుగా తయారు చేశాయి.

సినిమాకు పనిచేసిన టీమ్ వీళ్లే
నటీనటులు: విశాల్, తమన్నా, జగపతిబాబు, నిరోషా, సూరి, వడివేలు, తరుణ్ అరోరా, జయప్రకాష్, చరణ్ తదితరులు.
సంగీతం: హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్,
మాటలు: రాజేష్ ఎ.మూర్తి,
పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ,
ఎడిటింగ్: ఆర్.కె. సెల్వ,
డాన్స్: దినేష్, శోభి,
సహ నిర్మాత: ఇ.కె. ప్రకాష్,
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సురాజ్.
నిర్మాత: హరి;
నిడివి: 2 గంటల 27 నిమిషాలు
విడుదల: శుక్రవారం
అయితే మనం ఆశా జీవులం కాబట్టి...పాచిపట్టిన పాత రొటీన్ కథలనే లేటెస్ట్ మాస్ సినిమాలంటూ చేస్తున్న విశాల్ కి ఈ సినిమా ఫలితంతో అయినా జ్ఞానోదయం అయ్యి..కొత్త తరహా కథలవైపు అతని చూపు తిరుగుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











