ఏ మంత్రం వేసావే సినిమా రివ్యూ: సోషల్ మీడియా వ్యసనంపై..
Recommended Video

సంచలన విజయం సాధించిన అర్జున్రెడ్డి చిత్రం తర్వాత హీరో విజయ్ దేవరకొండ నటించిన ఏ మంత్రం వేసావే. వాస్తవానికి ఈ చిత్రం అర్జున్రెడ్డికి ముందే షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని విడుదల చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి నిర్మాత మల్కాపురం శివకుమార్, దర్శకుడు శ్రీధర్ మర్రి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వ్యసనం, మోసాలు కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మార్చి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలాంటి టాక్ను సొంతం చేసుకొన్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

ఏం మంత్రం వేశావే స్టోరి
నిక్కి (విజయ్ దేవరకొండ)కి కంప్యూటర్ గేమ్స్ ఆడటం అంటే పిచ్చి. బాహ్య ప్రపంచాన్ని కూడా మరిచిపోయి కంప్యూటర్స్లో గేమ్స్ ఆడుతుంటాడు. నిక్కీ వ్యవహారం అతని తల్లిదండ్రులకు మానసిక వ్యధకు గురిచేస్తుంది. ఇక రాగమాలిక ఉరఫ్ రాగ్స్ (శివానీ సింగ్) కంప్యూటర్ గేమ్స్ డిజైనర్, డెవలపర్. ఓ కారణంగా రాగ్స్ని చూసి నిక్కి ప్రేమలో పడుతాడు. కానీ రాగ్స్ వెంట ఓ గ్యాంగ్ వెంటపడి దాడి చేసి బంధిస్తుంది.

కథ క్లైమాక్స్ చేరిందిలా...
అలాంటి పరిస్థితుల్లో తన ప్రేయసిని నిక్కి ఎలా రక్షించుకొన్నాడు? రాగమాలికను ఎవరు? ఎందుకు దాడి చేశారు? నిక్కి తన ప్రేమను ఎలా గెలుచుకొన్నాడు? కంప్యూటర్ గేమ్స్ ఆడే వ్యసనం నుంచి నిక్కి ఎలా బయటపడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఏ మంత్రం వేసావే సినిమా కథ.

ఫస్టాఫ్లో
తొలిభాగంలో కంప్యూటర్స్ గేమ్స్ బానిసైన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి దర్శకుడు చాలానే సమయం తీసుకొన్నాడు. ఇక ప్రధమార్థంలో ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా కారణంగా యూత్ ఎలా మోసపోతున్నారు అనే అంశాలతో కథను నడిపించాడు. ఇక శివానీ ప్రేమలో పడిన నిక్కి ఆరాటంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. తాను ఎవరో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ట్రెజర్ హంట్ మాదిరిగా గేమ్ను పెట్టడం కథలో కీలకమైన పాయింట్. ఇక ఓ గ్యాంగ్ శివానీ దాడి చేయడమనే పాయింట్ వద్ద ఇంటర్వెల్ పడుతుంది.

సెకండాఫ్లో
ఇక రెండో భాగంలో విజయ్ దేవరకొండ తన ప్రేయసి కోసం ఏమి చేశాడు. ఆ క్రమంలో ఆన్లైన్లో ప్రేమ పేరుతో యువతులను మోసానికి గురిచేసే గ్యాంగ్ను ఎలా పట్టించాడు అనేది కొంత ఆసక్తిని రూపుతుంది. చివర్లలో అనూహ్యమైన మలుపుతో కథ స్వరూపమే మారిపోతుంది. అయితే ఇలాంటి అంశాలను సరైన రీతిలో ప్రజెంట్ చేయకపోవడం, పేలవమైన కథనం, నాసిరకమైన పాత్రధారుల ఎంపిక ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ అని చెప్పవచ్చు.

దర్శకుడు శ్రీధర్ మర్రి
దర్శకుడు శ్రీధర్ మర్రి రాసుకొన్న కథ బాగానే ఉంది. కానీ కథనం మరీ పేలవంగా ఉండటం వలన అసల కథ పక్కదారి పట్టినట్టు కనిపిస్తుంది. అ సందర్భమైన సన్నివేశాలు, అవసరం లేని ట్విస్టులు దర్శకుడి అపరిపక్వతకు అద్దం పట్టాయి. ముఖ్యంగా పలు సందర్భాలలో దర్శకుడు కథపై పట్టు కోల్పోయాడని విషయం సగటు ప్రేక్షకుడికి అర్ధమవుతుంది. కథ, కథనాలపై సరైన కసరత్తు చేసి ఉంటే ఓ మంచి కాన్సెప్ట్కు న్యాయం జరిగేది.

విజయ్ దేవరకొండ యాక్టింగ్
అర్జున్రెడ్డికి ముందు విజయ్ దేవరకొండ నటించిన చిత్రమిది. విజయ్ టాలెంట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు గానీ.. ఇప్పుడు మెచ్చురిటీ మాత్రం కనిపించదు. కథ, దర్శకుడి విజన్ మేరకు విజయ్ తన వంతు ప్రయత్నం చేశాడని మాత్రం చెప్పవచ్చు. అర్జున్రెడ్డి క్రేజ్ తర్వాత విజయ్ ఫెర్ఫార్మెన్స్ను ఆశించి వెళితే మాత్రం ప్రేక్షకులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది.

శివానీ సింగ్ నటన
శివానీ సింగ్కు ఇది తొలి చిత్రం. మొదటి చిత్రంలోనే భారమైన పాత్రనే మోయాల్సి వచ్చింది. కానీ అనుభవలేమి కారణంగా పాత్రను మరోస్థాయికి తీసుకెళ్లలేకపోయింది. కీలక సన్నివేశాల్లో ఆమె నటన తేలిపోయింది. నటనపరంగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది.

మిగితా పాత్రల్లో
ఇక మిగితా పాత్రల్లో నటించిన వారి గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఒకరో ఇద్దరో తప్ప మిగితా నటులంతా రెగ్యులర్ ప్రేక్షకులకు తెలియని వారే. వారిలో చాలా మంది కథపై పెద్దగా ప్రభావం చూపించిన వారు లేకపోవడం వారి ప్రస్తావన అవసరం లేదని చెప్పవచ్చు.

టెక్నికల్ టాలెంట్
సాంకేతిక విభాగాల గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొంతలో కొంత మెరుగ్గా కనిపిస్తాయి. ఎడిటింగ్ విభాగానికి చేతిలో చాలానే పని ఉందనే భావన కలుగుతుంది. కథలో పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడం, ఉన్న పాటలు ఆసక్తికరంగా లేకపోవడం మైనస్ అని చెప్పవచ్చు.

ఫైనల్గా
ఏం మంత్రం వేశావే అనే చిత్రం భారీగా ఊహించి వెళితే నిరాశ పరచడం ఖాయం. కథ, కథనాలు, టేకింగ్ చాలా నాసిరకంగా ఉండటం వల్ల పలుమార్లు ఇబ్బందికి గురికావాల్సి వస్తుంది. అర్జున్రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడం బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్
విజయ్ దేవరకొండ
సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్
కథ, కథనం
టేకింగ్
ఎడిటింగ్
ప్రొడక్షన్ వ్యాల్యూస్

తెర ముందు, తెర వెనుక
నటీనటులుః విజయ్ దేవరకొండ, శివానీ సింగ్, శివన్నారాయణ, ఆశిష్ రాజ్
దర్శకత్వంః శ్రీధర్ మర్రి
నిర్మాతః మల్కాపురం శివకుమార్
సంగీతంః అబ్దుస్ సమద్
ఎడిటర్ః ధర్మేంద్ర కకరాల
బ్యానర్ః గోలీసోడా ప్రొడక్షన్
విడుదలః మార్చి 9, 2018


Click it and Unblock the Notifications











