భారతరత్న, పద్మ అవార్డులపై స్పందించిన పవన్ కల్యాణ్..
వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విశిష్ట వ్యక్తులు, బహుముఖ ప్రతిభావంతులకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారాలైన భారత రత్న, పద్మ విభూషన్, పద్మ భూషణ్, పద్మశ్రీ, అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు. ఆయ రంగాల్లో ఈ అవార్డులను అందుకొన్న ప్రముఖులకు పేరు పేరున అభినందనలు తెలిపారు. జనసేన విడుదల చేసిన ప్రత్యేక ప్రకటనలో పవన్ కల్యాణ్ అభినందనలు ఇలా తెలియజేశారు. వివరాల్లోకి వెళితే..

ప్రణబ్కు భారత రత్న ఇవ్వడంపై
రాష్ట్రపతిగా దేశానికి అత్యుత్తమ సేవలందించిన శ్రీ ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న అవార్డును ప్రధానం చేయడం చాలా సంతోషకరం. పలు హోదాల్లో దశాబ్దాలపాటు సేవలందించిన వ్యక్తి ప్రణబ్ అని పవన్ కల్యాణ్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా మాజీ రాష్ట్రపతి, మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం భారత రత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

భూపెన్ హజారికా, నానాజీకి భారత రత్న
గ్రామీణ భారతం కోసం, రైతు సాధికారిత కోసం తపించిన శ్రీ నానాజీ దేశ్ముఖ్, సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీ భూపెన్ హాజారికాకు మరణాంతరం భారతరత్నకు ఎంపిక చేయడంపై పవన్ స్పందించారు. వారు అందించిన సేవలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఈ గణతంత్ర దినోత్సవ వేల భారతరత్న, పద్మ పురస్కార గ్రహీతలందరికీ నా శుభాకాంక్షలు అని ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

సిరివెన్నెలకు పద్మశ్రీ అవార్డు
తెలంగాణ రాష్ట్రం నుంచి సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పద్మశ్రీ పురస్కారానికి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్ని విధాల అర్హులు. ఆశావాద దృక్పథాన్ని, మానవ సంబంధాల విలువలను, భారతీయ ఆత్మను తన పాటల్లో పొందుపరుస్తారు అని పవన్ తన ప్రకటనలో తెలిపారు.

హారిక, వెంకటేశ్వరరావు, సునీల్కు అవార్డులు
పద్మశ్రీ అవార్డును అందుకోబోతున్న చెస్ క్రీడాకారణి ద్రోణవల్లి హారిక, సేంద్రియ సాగుకు ప్రాచుర్యం తీసుకువస్తున్న రైతు నేస్తం వై వెంకటేశ్వరారావు, ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛేత్రికి పవన్ అభినందనలు తెలిపారు. దేశానికి తమ ప్రతిభతో ఖ్యాతిని అందజేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











