స్వగ్రామానికి కమెడియన్ వివేక్ అస్థికలు.. గ్రామస్తులు చేసిన పనికి షాకవ్వాల్సిందే !
గుండెపోటు రావడంతో తమిళ హాస్యనటుడు వివేక్ ఇటీవల చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన చనిపోయారు. వివేక్ ఆకస్మిక మరణం తమిళ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఇప్పటికే వివేక్ జ్ఞాపకార్థం, ఆయన మిషన్ ను కొనసాగించడానికి చాలా మంది ప్రముఖులు మొక్కలు నాటారు. అయితే ఆయన అస్తికల గురించి కీలక అంశాలు వెల్లడయ్యాయి.

స్వగ్రామానికి అస్థికలు
అయితే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య విరుగంబక్కం శ్మశానవాటికలో దహన సంస్కారాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే మామూలుగా ఎవరి అస్థికలు అయినా గంగలోనో వేరే ఇతర పుణ్య నదుల్లోనో కలపడం ఆనవాయితీ కానీ వివేక్ అస్థికలను మాత్రం మదురై సమీపంలోని ఆయన పూర్వీకుల గ్రామమైన పెరుంగూటూరుకు పంపారు.

పూజ చేసి మొక్కలతో పాటు
అందుతున్న సమాచారం మేరకు వివేక్ బంధువులు పెరుంగటూర్లో అస్థికలకు ఒక పూజ నిర్వహించారు. అనంతరం ఆయన అస్థికలను మొక్కలు నాటడానికి ఉపయోగించారు. అవును, కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి శ్మశాన వాటికలో మొక్కలు నాటారు. ఇది నిజంగా అక్కడి ఉన్న వారి హృదయాలను గెలుచుకుంది. ఆయన కుటుంబం చేసిన ఈ పని గురించి చాలా మంది ప్రముఖులు తమ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.

కలాం స్ఫూర్తితో
వివేక్ ప్రకృతి ప్రేమికుడు. చాలా సార్లు తన గురువు మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం అని పలు సందర్భాల్లో చెబుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే కలాం కోరిక మేరకు గ్లోబల్ వార్మింగ్కు వ్యతిరేకంగా ప్రచారంతో పాటు, చెట్ల పెంపకాన్నితన జీవిత మిషన్గా చేపట్టారు. తన వంతు బాధ్యతగా కోటి చెట్లు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 2011 లో భారీ చెట్ల పెంపకం కోసం 'గ్రీన్ కలాం' ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే 33.23 లక్షల మొక్కలు నాటారు. అందుకే ఆయన కోరిక తీర్చడానికి గాను ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.

విజయ్ పరామర్శ
ఇక వివేక్ కుటుంబాన్ని నిన్న నటుడు విజయ్ పరామర్శించారు. వివేక్ మరణించిన సమయంలో జార్జియాలో షూటింగ్ జరుగుతున్నందున 65 చిత్ర షూటింగ్ లో ఉన్నారు. వివేక్ మరణ వార్త తెలిసినా కరోనా నిబంధనల కారణంగా ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించలేని పరిస్థితి. అందుకే ఆయన వెంటనే రాలేకపోయారు. జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం చెన్నై చేరుకున్న విజయ్ సోమవారం ఉదయం వివేక్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్ కెరీర్ మొదటి నుండి వివేక్ ఆయనతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చివరిగా విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రంలో వివేక్ కీలక పాత్రను పోషించారు.

నేను సైతం అంటూ రమ్య పాండియన్
తాజాగా తమిళ బిగ్ బాస్ 4 ఫేమ్ రమ్య పాండియన్ తిరువల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో వివేక్ వయస్సుకు గుర్తుగా 59 చెట్లను నాటారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. "వివేక్ సార్ కు నివాళిగా, మేము ఎస్పీ ఆఫీసు తిరువల్లూరులో 59 మొక్కలు నాటాము ... ఆయన మాకు స్ఫూర్తిదాయకం, ఆయన వదిలిపెట్టిన ఈ వారసత్వాన్ని కొనసాగిస్తామని నేను హామీ ఇస్తున్నాను. దీంతో ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











