'విశ్వరూపం' పై నిషేధం ఎత్తివేత... హైకోర్టు గ్రీన్ సిగ్నల్
చెన్నై: 'విశ్వరూపం' చిత్రం విడుదలపై ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో కమల్హాసన్కు వూరట లభించింది. 'విశ్వరూపం' విడుదలపై నిషేధాన్ని తొలగిస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. చిత్రాన్ని ఈ రోజు(బుధవారం,జనవరి 30) విడుదల చేసుకోవచ్చంటూ పచ్చజెండా వూపింది. సెన్సార్ బోర్డు అనుమతిచ్చాక అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.వెంకట్రామన్ తీర్పు చెప్పారు.
మంగళవారం పొద్దున్నుంచి రాత్రి వరకు జరిగిన విచారణలో వాడివేడిగా సాగిన ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి జస్టిస్ వెంకటరామన్ ఈ మేరకు రాత్రి పదిగంటలకు తీర్పు ఇచ్చారు. ఈ చిత్రం విడుదలను నిలిపేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్వకేట్ జనరల్ నవనీత కృష్ణన్ గట్టిగా సమర్థించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి లేదని చిత్రనటుడు, నిర్మాత కమల్ హాసన్ తరఫు న్యాయవాదులు వాదించారు.
మరో ప్ర్కక్క కమల్హాసన్ స్వీయ దర్శక నిర్మాణంలో నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని విడుదల చేయాలని పలు మహిళా సంఘాలు కమిషనర్ను కోరాయి. ఈ మేరకు 'ఆల్ఇండియా మక్కల్ నల పేరవై', 'అఖిల భారత అరివాలి అరకట్టలై', 'తామరై మహిళల సంఘా'నికి చెందిన మహిళలు సోమవారం కలెక్టర్ను కలసి వినతిపత్రం అందజేశారు. 'నటుడు కమల్హాసన్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ముస్లీంలను సహోదరులుగా భావించే మంచి వ్యక్తి. ముస్లీం సంఘాల వ్యతిరేకతో ఆ సినిమా ఆగిపోయింది. విడుదల చేసేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని' కోరారు.
విశ్వరూపాన్ని సినిమా దృష్టితోనే చూడాలని, కొన్ని అభిప్రాయాలకు వ్యతిరేకత చెప్పడం సబబు కాదని ఫిర్యాదు అందజేయడానికి వచ్చిన మహిళా సంఘం ప్రతినిధి సుజాత తెలిపారు. 'విశ్వరూపం' విడుదల చేయాలంటూ పుదుచ్చేరిలో కమల్ అభిమానులు కలెక్టరేట్ను ముట్టడించారు. పుదుచ్చేరి కమల్హాసన్ అభిమానుల సంఘం అధ్యక్షుడు హరి కృష్ణన్ నేతృత్వంలో సుమారు వందమందికిపైగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల చర్చల అనంతరం కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ అభిమాన నటుడి సినిమాకు అడ్డంకులు తొలగించాలని కోరారు. మొత్తానికి అందరి కోరికలు తీరి..సినిమా రిలీజుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











