సర్కార్పై బిజెపి అటాక్.. ఇలాంటి కథతో సీఎం అయిపోదామనుకున్నాడా!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్. ఏఆర్ మురుగదాస్, విజయ్ సూపర్ హిట్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ఇది. సర్కార్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురుగదాస్ శైలిలో సందేశాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో దొంగ ఓట్ల అంశాన్ని మురుగదాస్ ప్రధానంగా చూపించినట్లు తెలుస్తోంది. విజయ్ నటించిన గత చిత్రం మెర్సల్ లో కూడా చాలా పొలిటికల్ సెటైర్స్ పేలాయి. ఆ చిత్రం వివాదాలతో పెద్ద దుమారమే సృష్టించింది. అదే తరహాలో సర్కార్ చిత్రం విషయంలో కూడా రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.

హ్యాట్రిక్ కాంబినేషన్
మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో గతంలో కత్తి, తుపాకీ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు వచ్చాయి. దీనితో వీరి కాంబోలో తెరకెక్కిన సర్కార్ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో సర్కార్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదలైన వివాదాలు
సర్కార్ చిత్రం విడుదలకు ముందే వివాదాలు మొదలయ్యాయి. సర్కార్ కథని కాపీ చేసారంటూ మొన్నటివరకు వివాదం కొనసాగింది. చర్చలతో ఆ వివాదాన్ని సద్దుమణిగించారు. సర్కార్ చిత్రంలో రాజకీయ పరమైన అంశాలు ఉండడంతో తాజాగా ఈ చిత్రంపై పొలిటికల్ అటాక్ మొదలైంది. మెర్సల్ చిత్రంపై కూడా బిజెపి నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

సీఎం అయిపోదామని బయలుదేరారండీ
తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు సౌందర్ రాజన్ పరోక్షంగా సర్కార్ చిత్రంపై, విజయ్ పై సెటైర్లు వేశారు. ఓ కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న సౌందర్ రాజన్ విజయ్ పై సెటైర్లు వేశారు. కొందరు ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ సీఎం అయిపోదామని బయలుదేరుతున్నారు. అలాంటి వాళ్ళు సినిమాల్లో మాత్రమే ముఖ్యమంత్రులు అని ఆమె విమర్శించారు.

కథని దొంగిలించి ఇలాంటి సినిమా
దొంగిలించిన కథతో దొంగ ఓట్ల గురించి సినిమా చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ పరిస్థితి బాగానే ఉంది. నటులు వచ్చి బాగు చేయాల్సిన అవసరం లేదు అని సౌందర్ రాజన్ అన్నారు. ఈ విమర్శలు విజయ్ గురించేనా అనే ప్రశ్నకు బదులిస్తూ.. నటులని విమర్శించాలనేది నా ఉద్దేశం కాదు. దొంగిలించిన కథతో ఈ సినిమాని నిర్మించారు. అలాంటి కథలోని దొంగిలించిన ఓట్ల గురించి ఎందుకు మాట్లాడాలి అని అన్నారు.

సర్కార్ ఆడియో వేడుకలో
ఇదిలా ఉండగా విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి సర్కార్ ఆడియో వేడుకలో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ తాను నిజంగానే ముఖ్యమంత్రి అయితే సినిమాల్లోలాగా చేయనని తెలిపిన సంగతి తెలిసిందే. కమల్, రజని వంటి స్టార్ హీరోల రాజకీయాల గురించి చర్చ జరుగుతున్న సమయంలో విజయ్ అంశం కూడా తెరపైకి వచ్చింది.

విజయ్ అభిమానులపై లాఠీ ఛార్జ్
ఇదిలా ఉండగా తమిళనాడు వ్యాప్తంగా సర్కార్ చిత్ర విడుదల హంగామా కనిపిస్తోంది. విజయ్ అభిమానులు థియేటర్స్ కు పోటెత్తుతున్నారు. చెన్నై లోనివెంకటేశ్వర అనే థియేటర్ లో టికెట్స్ కోసం అభిమానులు బారులు తీరడంతో ఆ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ స్తంభించి పోయింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయడం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











