తమిళనాడులో వారిసు చిచ్చు.. టాలీవుడ్లో ఒంటరైన దిల్ రాజు.. టార్గెట్ మామూలుగా లేదే
టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎదురులేకుండా అధిపత్యాన్ని కొనసాగించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం ఆత్మరక్షణలో పడే పరిస్థితి కనిపిస్తున్నది. తమిళ సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయనకు అనేక సమస్యలు ఇప్పుడు కొరకరాని కొయ్యలుగా మారాయి. సంక్రాంతి పండుగ కానుకగా విజయ్ నటించిన వారిసు (తెలుగులో వారసుడు) చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి భారీ విజయాన్ని అందుకొనే ప్లాన్ చేశారు. కానీ తన ప్రయత్నాలకు ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తున్నది. అయితే ఇప్పటి వరకు అందరి మద్దతుతో ముందుకెళ్లిన దిల్ రాజు ప్రస్తుతం ఒంటరివాడైపోయాడా? అనే వాదన తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సమ్మెతో
విజయ్ తో వారిసు సినిమా ముందు వరకు టాలీవుడ్లో దిల్ రాజు ఆడింది ఆట.. పాడింది పాట. అయితే వారిసు సినిమా నిర్మాణంలో ఉండగా, హీరోల రెమ్యునరేషన్లు పెరిగిపోయాయనే కారణం, ఇతర అంశాలతో సినిమా పరిశ్రమను స్థంభింప జేశాడు. అంతేకాకుండా నెల రోజుల పాటు సినిమాల షూటింగును ఆపివేశాడు. అయితే ఈ విషయంలో దిల్ రాజుపై పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వారిసు సినిమా షూటింగును అదే సమయంలో కొనసాగించడంతో పలువురు ప్రశ్నించాడు. అయితే వారిసు తెలుగు సినిమా కాదు.. తమిళ సినిమా కాబట్టి సమ్మెతో సంబంధం లేదని వివరించాడు.

వారిసుకు తక్కువ థియేటర్లు
అయితే ప్రస్తుతం వారిసు సినిమా, అజిత్ నటించిన తనివు అనే సినిమా విషయంలో వివాదం తలెత్తింది. అజిత్ సినిమాను స్టాలిన్ కుమారుడు డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం, విజయ్ సినిమాకు తక్కువ థియేటర్లు ఇవ్వడం వివాదానికి కేంద్ర బిందువు అయింది. అయితే ఈ విషయంలో విజయ్ సూపర్ స్టార్.. ఆయనకు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని వ్యాఖ్యలు చేయడం ఈ వివాదాన్ని మరింత రెచ్చగొట్టేలా చేశాయి.

విజయ్ నంబర్ వన్.. అజిత్?
ఇటీవల తెలుగు మీడియాతో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్ స్టార్ హీరో.. అతడు నెంబర్ వన్ హీరో. తమిళనాడులో సగం థియేటర్లు ఇచ్చినా ఆయన స్థాయికి అన్యాయమే అని దిల్ రాజు అన్నాడు. అయితే విజయ్ స్టార్ హీరో అయితే.. అయితే అజిత్ స్టార్ హీరో కాదా అనే కొత్త వివాదాన్ని లేవనెత్తాడు. అయితే తన మాటలను మరో విధంగా తీసుకోవద్దు.. అజిత్ అంటే.. నాకు చాలా గౌరవం ఉంది. నేను మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలి అని దిల్ రాజు అన్నాడు.

ఒంటరివాడైన దిల్ రాజు
ఇదిలా ఉండగా, తమిళనాడులో చెలరేగుతున్న వివాదం.. తెలుగు రాష్ట్రాలకు పాకింది. దిల్ రాజుతో మనస్పర్ధలు ఉన్న ఓ వర్గం ఒక్కతాటిపైకి వచ్చి ముప్పేట దాడి చేస్తున్నారనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇలాంటి సమయంలో దిల్ రాజు ఒంటరిగా మారి డిఫెన్స్లో పడినట్టు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో దిల్ రాజు ఒంటరిపోయాడా అనే మాట కూడా వినిపిస్తున్నది. గతంలో ఎంతో మందికి అండగా నిలిచిన దిల్ రాజుకు ఇప్పుడు ఎవరు పక్కన లేరనే విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

2022 చేదు అనుభవాలు..
ఇదిలా ఉండగా, 2022 సంవత్సరం దిల్ రాజుకు పెద్దగా ఆశించినంతగా కనిపించలేదు. ప్రతీ ఏడాది వరుస హిట్లతో టాప్ రేపే ఆయనకు ఈ ఏడాది చేదు అనుభవాలను పంచింది. టాలీవుడ్ సమ్మె, బాలీవుడ్ సినిమాల ఫెయిల్యూర్స్, వారిసు వివాదంతో ఈ ఏడాదిని ప్రతికూలంగా ముగించడానికి సిద్దమయ్యారు. అయితే 2023 సంవత్సరంలో దిల్ రాజు మళ్లీ ట్రాక్ పైకి వస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











