కమలహాసన్పై చర్యలు తీసుకోండని డిమాండ్
చెన్నై: ప్రముఖ నటుడు కమలహాసన్పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సినీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం కార్యదర్శి పన్నీర్ సెల్వం హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.
తమ సంఘం తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల యాజమాన్యం శ్రేయస్సు కోసం పాటుపడుతోందని పేర్కొన్నారు. నటుడు కమలహాసన్ భాగస్వామిగా ఉన్న రాజ్కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన విశ్వరూపం చిత్రాన్ని జనవరి 11న థియేటర్లలోను, డీటీహెచ్ ద్వారా విడుదల చేయనున్నట్లు వెల్లడించారని తెలిపారు.
చిత్రాన్ని డీటీహెచ్ ద్వారా విడుదల చేయడానికి తాను వ్యతిరేకించానని పేర్కొన్నారు. ఆ తరువాత విశ్వరూపం చిత్రాన్ని నిషేధించాలంటూ ముస్లిం సంఘాలు ఆందోళన చేయడంతో సమస్య హైకోర్టుకు వెళ్లిందన్నారు. ఎట్టకేలకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ సహకారంతో విశ్వరూపం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు.
విశ్వరూపం చిత్రాన్ని విడుదల చేయబోమని డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల యాజమాన్యాల సంఘం తీర్మానించాయని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ రాజ్కమల్ ఇంటర్నేషనల్ సంస్థ భారత్ సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసిందన్నారు.
విశ్వరూపం వ్యవహారంలో తామెలాంటి తీర్మానం చేయలేదని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. తమ సంఘం రిజిస్టర్ నెంబర్ను దుర్వినియోగం చేస్తూ విశ్వరూపం చిత్ర వ్యవహారంలో తీర్మానం చేసినట్టు ఆ సంస్థ పేర్కొందని వెల్లడించారు.
అసత్య ఆరోపణలు చేసిన రాజ్కమల్ ఇంటర్నేషనల్ సంస్థ పైన, నటుడు కమలహాసన్ మీద ఏప్రిల్ 17న పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. తమ ఫిర్యాదుపై చర్యలు తీసుకునేలా పోలీసు కమిషనర్ను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











