పంచ్ డైలాగులు పెట్టవద్దని స్ట్రిక్ట్ గా స్టార్ మాస్ హీరో...
చెన్నై : తెలుగు,తమిళ ఏ భాషా అయినా కానివ్వండి...పంచ్ డైలాగులు లేకపోతే హీరోలకు డైలాగులు చెప్పినట్లే ఉండటం లేదు. అందుకోసం వారు పనిగట్టుకుని మరీ ఆ డైలాగులు రాయించుకుంటున్నారు. అయితే ఓ మాస్,స్టార్ హీరో వాటిని వద్దని చాలా స్పష్టంగా చెప్పారట. ఆయన మరెవరో కాదు తమిళ హీరో అజిత్. ఆయన తాజా చిత్రం 'వీరం'లో ఆ డైలాగులు ఉండవని చెప్తున్నారు దర్శకుడు శివ.
శివ మాట్లాడుతూ... 'వీరం' కథ కోసం ఎన్నెన్నో పంచ్ డైలాగులను సిద్ధం చేశా. కానీ కథ విన్న అజిత్.. ఆ పంచ్లు వద్దని చెప్పేశారు. మేం నిరాశ చెందలేదు. ఆయన అభిరుచికి తగ్గట్టు మాటలు రాశాం. ఇందులో సాధారణ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్నారాయన. పాత్ర పేరు 'వినాయకం' అన్నారు. ఇక తెరవెనుక అజిత్ గురించి చెప్పాల్సిందే. చాలా సరదా వ్యక్తి. తాను నవ్వుతూ.. సెట్లోని అందర్నీ నవ్వించే వ్యక్తిత్వం. ఆ హాస్య హావభావాలు నాకెంతో నచ్చాయి. వాటినే సినిమాలో చూపించాలని అజిత్ను అడిగా. ప్రేక్షకులు ఒప్పుకుంటారా? అని అడిగారు. దుమ్ము లేచిపోతుందని చెప్పా. చిన్నగా నవ్వి.. సరేనన్నారు అని చెప్పుకొచ్చారు.

ఇటీవల క్లాస్ పాత్రలతో వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. ఉన్నట్టుండి పల్లెటూరి ఆహార్యంతో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. తెల్ల పంచె, చొక్కాతో చాలాకాలం తర్వాత కనువిందు చేస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే.. అదే నెరసిన జుత్తు, గడ్డంతో నటిస్తున్నాడు. జయాపజయాలను ఏమాత్రం లెక్కచేయకుండా.. తన చిత్ర ప్రచారానికి కూడా రాకుండానే నటనే తన పనిగా వ్యవహరిస్తుంటాడు 'తల'. 'అనవసర విషయాలతో ప్రేక్షకుల్లో ఆశలు రేకెత్తించడం నాకు ఇష్టం ఉండద'నే ఆయన.. తాజాగా పంచ్ డైలాగులూ వద్దనే విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయాన్ని తన దర్శకుడు శివకి ప్రధాన షరుతుగా పెట్టాడట. ఆయన నటించిన తాజా చిత్రం 'వీరం' సంక్రాంతికి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తోంది.
శివ కథ గురించి చెప్తూ ...అజిత్ వద్దకు వెళ్లినప్పుడు... 'గ్రామీణ నేపథ్యంలో కథ తయారుచేయండి. మామ, బామ్మరిది, అన్న, తమ్ముడు.. ఇలా అన్ని కుటుంబ పాత్రలూ అందులో కనిపించాల'ని సూచించారు. 'గుడ్ ఫీల్' లభించే కుటుంబ కథలో నటించాలనుందని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే 'వీరం' కథ అల్లాను. కథనం కూడా చాలా చక్కగా వచ్చింది. ఇందులో క్త్లెమాక్స్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిభోజనంలా ఉంటుంది. అంటే.. అన్నం, సాంబారు, రసం... అనుకునేరు. నాటుకోడి, చేపల పులుసు వంటి రుచికరమైన విందును ప్రేక్షకులకు అందజేయనున్నాం అన్నారు.

ఇక అజిత్తో సినిమా తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆ అవకాశం ఇన్నాళ్లకు దక్కింది. 'వీరం' నిర్మాత వెంకట్రామరెడ్డితో తొలిసారిగా ఈ కథ చర్చించా. ఎంజీఆర్కు 'ఎంగవీట్టు పిల్లె'లా 'వీరం' అజిత్కు అంతటి పేరు తెచ్చిపెడుతుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులు ఎంతో సంతోషపడతారని చెప్పారు. అంతేకాదు.. అన్ని వయస్సుల వారూ థియేటర్లకు వచ్చేలా ఉందంటూ కితాబిచ్చారు. ఆ సంతోషం ఇప్పటికీ మరచిపోలేకున్నా. అంతస్థాయిలో సినిమానూ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు.
షూటింగ్ విశేషాలు చెప్తూ...అజిత్తోపాటు ఈ సినిమాలో సంతానం ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వీరికితోడు తంబి రామయ్య కూడా ఉన్నారు. ముఖ్యమైన సన్నివేశాలను స్విట్జర్లాండ్లో చిత్రీకరిస్తుండగా అందరికీ పెద్దదీపాల వెలుతురు కారణంగా నేత్ర సమస్యలు తలెత్తాయి. మరునాడు ఉదయం అందరం గదికి వెళ్లాక అజితే చుక్కలమందు వేశారు. ఆరోజు అందరూ ఆయన్ను 'యాక్టర్ అజిత్ బదులు.. డాక్టర్ అజిత్' అంటూ పిలిచారు. లైట్బాయ్ నుంచి ప్రతి ఒక్కరితోనూ చాలా సరదాగా ఉంటారు అజిత్. ఇక ఈ సినిమా ప్రత్యేకతను సంక్రాంతికి తెరపైనే చూడాల్సిందే అని ముగించారు.


Click it and Unblock the Notifications











