భద్రత కల్పించమంటూ ప్రభుత్వానికి హీరో విజయ్ వినతి
విజయ్ హీరోగా దీపావళి కానుకగా వచ్చిన చిత్రం 'తుపాకీ' . ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదలైంది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇండియా నేషనల్ లీగ్ కట్చి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చెన్నై నీలాంగరైలో ఆందోళన చేపట్టారు.
హీరో విజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కపాలీశ్వరన్ వీధిలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. రంగప్రవేశం చేసిన పోలీసులు 65 మందిని అరెస్టు చేశారు. నీలాంగరై, వడపళనిలోని విజయ్ ఇళ్లకు నగర పోలీసులు గట్టి భద్రత కల్పించారు. అడయారులోని విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్, విరుగంబాక్కంలోని దర్శకుడు మురుగదాస్ ఇంటికి కూడా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లను ముట్టడిస్తామని ఇండియా నేషనల్ లీగ్ కట్చి అధ్యక్షుడు జవహర్ అలీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంటనే ఈ చిత్రాన్ని నిషేధించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జవహర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... తక్షణం తుపాకీ సినిమాలో ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా వున్న డైలాగుల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముస్లిం వర్గానికి చెందిన అన్ని పార్టీలు, సంస్థల్ని కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముస్లింలను తీవ్రవాదులుగా, సంఘవిద్రోహశక్తులకు చిత్రీకరించడం ఎంతవరకు సబబని, మంచీచెడు అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో వుందని పేర్కొన్నారు. ఇదిలా వుండగా తుపాకీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను కల్పించారు. అలాగే ముస్లింల పేరు గల వారిని తీవ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమని పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications












