కోటిన్నర కుంభకోణం: రాధిక భర్తపై హీరో విశాల్ కంప్లైంట్
చెన్నై : రాధిక భర్త, నటుడు శరత్కుమార్పై దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ మధ్య జరుగుతున్న వివాదం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా విశాల్ తరఫున నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో కంప్లైంట్ నమోదైంది.
సంఘం లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ చేసిన ఆ ఆరోపణలను శరత్కుమార్ తీవ్రంగా ఖండించడంతోపాటు ఇదంతా చౌకబారు రాజకీయంగా విమర్శించారు. సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ సంతకం చేసిన ఓ ఫిర్యాదుపత్రాన్ని ఆ సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పూచ్చి మురుగన్ గురువారం ఉదయం నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో అందించారు.
ఆ కంప్లైంట్ లో ఇలా ఉంది...

సంఘం పూర్వ నిర్వాహకులు శరత్కుమార్, రాధారవి, వాగై చంద్రశేఖర్ తదితరులు 2009 నుంచి సక్రమంగా లెక్కలను నిర్వహించలేదని గుర్తించామన్నారు. అప్పట్లో వారిని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. తాజాగా లెక్కలు పరిశీలించగా రూ.1.60 కోట్ల మేర అవకతవకలు జరిగాయని చెప్పారు.
దీనిపై వివరణ కోరినప్పటికీ సమాధానం ఇవ్వలేదని తెలిపారు. శరత్కుమార్ సహా గత నిర్వాహకులపై చట్టపరమైన చేపట్టాలని ఆ పత్రంలో కోరారు. అయితే శరత్కుమార్ కూడా కమిషనరు కార్యాలయానికి వచ్చి ఓ ఫిర్యాదుపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
శరత్ కుమార్ మాట్లాడుతూ..... విశాల్ ప్యానెల్ గెలిచిన వెంటనే సంఘం లావాదేవీలకు సంబంధించిన వివరాలు వారికి సమర్పించానని తెలిపారు. లెక్కలు చూపలేదని ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. తన ప్రతిష్ఠకు కళంకం తీసుకొచ్చే ఉద్దేశంతో చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం అభ్యర్థులతో ముఖాముఖి జరుగుతోందని, వాటిని అడ్డుకోవడానికి రాజకీయంగా కుట్ర చేస్తున్నారని వాపోయారు. ఆదాయం లేని సంఘంలో ఎలా అవకతవకలు జరుగుతాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











