కమల్కు రాజకీయ పార్టీలు గాలం
చెన్నై: కమల్ హాసన్ కలల చిత్రం 'విశ్వరూపం' విడుదలకు తమిళనాడులో మార్గం సుగమమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కమల్కు గాలం వేసేందుకు తమిళ రాజకీయ పక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే, కాంగ్రెస్ ఆశలు పెంచుకున్నాయి. లోక్సభ ఎన్నికల్లో భారతీయుడి మద్దతు లక్ష్యంగా వ్యూహరచనల్లో మునిగిపోయూరు. కమలహాసన్కు తమిళనాడులో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారిని ఓటర్లుగా మార్చుకునేందుకు పొలిటకల్ పార్టీలు రెడీ అవుతున్నాయి.
రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే కమల్ ఇటీవల వేదిక ఎక్కారు. చిదంబరం పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు. పంచె కట్టినోడు ప్రధాని కావాలని డీఎంకే అధినేత కరుణానిధి సమక్షంలో ఆకాంక్షించారు. తర్వాత పరిణామాలు తెలిసినవే. విశ్వరూపం చూపిన చుక్కలతో సహనం నశించి చివరకు తానూ రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందేమోనన్న భయం కలుగుతోందని కమల్ పరోక్షంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలించిన డీఎంకే, కాంగ్రెస్ ఆయన్ను తమ వైపునకు తిప్పుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇళయదళపతి విజయ్ నటించిన కావలన్ చిత్రం విశ్వరూపం తరహాలో చిక్కుల్ని ఎదుర్కొంది. డీఎంకే సృష్టించిన అడ్డంకులతో ఆయన అభిమానులు ఎన్నికల వేళ అన్నాడీఎంకే పక్షాన నిలిచారు. ఇది కాస్త డీఎంకే కూటమికి గట్టిదెబ్బ తగిలేలా చేసింది.
ఇప్పుడు అదే తరహాలో కమల్ అభిమానులు తమ వెంట ఉంటారన్న భావనలో డీఎంకే, కాంగ్రెస్ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో భారతీయుడి మద్దతు కూడగట్టుకోవడం లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్నాయి. అయితే కమల్ దిగి వచ్చేనా అన్నది వేచి చూడాల్సిందే. విశ్వరూపం రూపంలో ఎదురైన రాజకీయాలతో తనకు ఓ అండ అవసరమని కమల్ గుర్తించారంటూ కోలీవుడ్ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. డీఎంకే నేత ఒకరు మాట్లాడుతూ కమల్ అంటే ఎనలేని అభిమానం రాష్ట్రంలో ఉందన్నారు. ఆయనకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడుల్లా డీఎంకే అండగా నిలుస్తోందని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో కమల్ అభిమానులు తమ వెంట ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ కమల్ రాజకీయాల్లోకి రాకున్నా తన మద్దతును పరోక్ష సంకేతంతో ప్రకటించినా చాలని పేర్కొన్నారు.
ఈ సినిమాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు జనవరి 23న విధించిన నిషేధపు ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ఏకవాక్యంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం ముస్లిం సంఘాలు, కమల్ హాసన్ మధ్య జరిగిన చర్చలు విజయవంతం కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన పలు దృశ్యాలను తొలగించటంతో పాటు, పలు సంభాషణల ధ్వనిని వినిపించకుండా చేసేందుకు కమల్ హాసన్ అంగీకరించారని ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి. తమిళనాట 'విశ్వరూపం' 524 థియేటర్లలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











