'నక్సలైట్ కావాలనుకున్నా' అంటున్న స్టార్ డైరక్టర్
చెన్నై: ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కూడా చదువుకొనేటప్పుడు డైరక్టర్ కావాలని అనుకోలేదట. సినీ పరిశ్రమకు రాక ముందు ఆయన నక్సలైట్ కావాలనుకొన్నారు. ఈ విషయాన్ని మురుగదాస్ వెల్లడించారు. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియచేసారు. అందుకే తన సినిమాల్లో సామాజిక ధృక్పధాన్ని వెల్లడించే సన్నివేశాలు ఉంటాయన్నారు. ఆయన తాజా చిత్రం తుపాకి త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్ లో ఆయన పూర్తి బిజీగా ఉన్నారు.
మురగదాస్ మాట్లాడుతూ...''పాఠశాల రోజుల్లో ఆత్మన్యూనత ఎక్కువగా ఉండేది. కాలేజీలో చదివేటప్పుడు బిడియం ఎలా పోయిందో కూడా తెలియదు. తప్పులను ప్రశ్నించే ధైర్యం పుట్టింది. అయితే ఆ తప్పులను ఎదుర్కొంటూ ఎలా పోరాడాలో తెలియని పరిస్థితి. నక్సలైట్ అవుదామా? రాజకీయ నేత అవుదామా? అనే ఆలోచన ఉండేది. ఒక చిన్నారి ఫొటో ఓ యుద్ధాన్ని ఆపింది. యుద్ధాన్ని ఆపే బలం ఆ ఫొటోకు వచ్చిందనే కారణంతో చిత్రసీమ వైపు అడుగులు వేశాను. అందుకే నా సినిమాల్లో సమాజంలోని లోపాల్ని సంస్కరించే దిశగా... వాటిపై అవగాహన కల్పించే సన్నివేశాలను చొప్పిస్తాను'' అన్నారు.
తుపాకీ విషయానికి వస్తే....విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్కున్న క్రేజ్, కాజల్కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎస్వీఆర్ మీడియా అధినేత సీజే శోభా చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'తన ప్రతి చిత్రాన్ని ఓ అద్భుతమైన కాన్సెప్ట్తో తెరకెక్కించే మురుగదాస్ ఈ చిత్రాన్ని కూడా ఓ వండర్లా తీర్చిదిద్దుతున్నాడు. త్వరలోనే పాటలను విడుదల చేసి దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించబోతుంది' అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, మాటలు: శ్రీరామకృష్ణ.


Click it and Unblock the Notifications











