భిక్షాటనతో కడుపు నింపుకుని.. అడవుల్లో తలదాచుకుంటూ... దారుణంగా హీరోయిన్ జీవితం
సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో, కలలతో ఎంతోమంది ముంబై, చెన్నై, హైదరాబాద్ రైళ్లు ఎక్కుతుంటారు. ఎన్నో కష్టాలుపడి తిరుగులేని క్రేజ్, కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టిన వారు తర్వాతి కాలంలో అడ్రస్ లేకుండా పోయారు. అపర కుబేరులు అనిపించుకున్నవారు చివరి రోజుల్లో దుర్బర దారిద్య్రాన్ని అనుభవించారు. మహానటి సావిత్రి, నాగయ్య, కాంతారావు తదితర నటీనటులు వైభవంగా బతికి చివరి రోజుల్లో ఎలా బతికారో అందరికీ తెలిసిందే.
భిక్షాటన చేస్తోన్న నటి
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ఇలాంటి వారెందరో ఉన్నారు. ఈ తరంలోనూ బాగా బతికి చితికిపోయిన నటీనటులు ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు ఈ నటి. వందలాది సీరియల్స్, సినిమాలలో హీరోయిన్గా, నటిగా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం కడుపు నింపుకోవడానికి భిక్షాటన చేస్తూ, గుహల్లో తలదాచుకుంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె ఎవరు? ఈ నటికి ఎందుకు ఇలాంటి పరిస్ధితి వచ్చింది? ఈ వివరాల్లోకి వెళితే..

150కి పైగా సీరియల్స్తో స్టార్డమ్
ఆ నటి పేరు నుపుర్ అలంకార్.. హిందీ చిత్ర పరిశ్రమలో, టీవీ రంగంలో బాగా పాపులర్. 20 ఏళ్ల కెరీర్లొ 150కి సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లో నటించారు. ఇందులో శక్తిమాన్ వంటి పాపులర్ సీరియల్తో పాటు.. ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, అగ్లే జనం మొహబితియా హై కిజో, రేత్, దియా ఔర్ బాటి హమ్ తదితర సీరియల్స్ ఉన్నాయి. నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నుపుర్.. హిమాలయాల్లో భిక్షాటన చేస్తూ కనిపించడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు.
నా జీవితం ముగిసిపోయిందనుకున్నా
దానిపై ఆమెను మీడియా ప్రతినిధులు ఆరా తీయగా.. తన జీవితం గురించి నుపుర్ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. 2019లో భారతీయ కార్పోరేట్ రంగాన్ని కుదిపేసిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం నా జీవితాన్ని తలక్రిందులు చేసింది.. ఈ సమయంలోనే నా తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. అమ్మకి వైద్యం చేయించానికి ఈ బ్యాంకులోనే డబ్బులు దాచుకున్నా.. కానీ ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల డబ్బు విత్ డ్రా చేయలేకపోయా. ముందు అమ్మ, ఆ తర్వాత నా సోదరి చనిపోయారు అని నుపర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినవారి మరణాలను దగ్గరగా చూసిన తనకు నా జీవితం కూడా ముగిసిపోయిందని భావించా.. దాంతో అన్నింటిపై విరక్తి కలిగింది. అన్ని బంధాలను కట్ చేసుకుని ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించానని చెప్పారు.
అడవులు, గుహల్లో జీవనం
2022లో నటనకు గుడ్బై చెప్పిన నుపుర్ అలంకార్.. సన్యాసం తీసుకుని తన పేరుని పీతంబర మాగా మార్చుకుంది. ముంబైని వీడిన ఈ నటి.. దేశంలోని అన్ని ప్రాంతాలను తిరిగారు. దాదాపు మూడేళ్లుగా నుపుర్ అలంకార్.. గుహల్లో, అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాల్లో, అత్యంత వేడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో నివసించింది. ఆ సమయంలో విష కీటకాలు, ఎలుకలు ఆమెను తీవ్రంగా గాయపరిచాయి.. ఆధ్యాత్మిక జీవనానికి అనువైన ప్రాంతాలను వెతికే క్రమంలో మనిషి గడ్డకట్టుకుపోయే ప్రదేశాల్లో సంచరించడంతో అనారోగ్యం బారినపడ్డారు నుపుర్. అయినప్పటికీ తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన నుపుర్.. ప్రస్తుతం కొన్ని బట్టలతోనే నెట్టుకొస్తున్నారు. డబ్బు, పేరు కోసం పాకులాడొద్దని నిరాడంబరంగా జీవించడం అలవాటు చేసుకుని, ఆధ్యాత్మిక మార్గంతో కనెక్ట్ కావాలని నుపుర్ అలంకార్ సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











