Bigg Boss Winner: ఆమె నిర్ణయం విన్నర్నే మార్చింది.. రేవంత్ను గెలిపించిన లేడీ కంటెస్టెంట్
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి.. పోతోన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల మనసులు చూరగొని రేటింగ్ను రాబడుతోన్నాయి. తద్వారా సక్సెస్ఫుల్ షోలుగా వెలుగొందుతోన్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఇది.. గత ఆదివారంతో ఆరో దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక, ఇందులో క్లైమాక్స్లో ట్విస్ట్ కనిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త చర్చ ఒకటి తెరపైకి వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

ఆటపాటలతో సాగిన ఎపిసోడ్
దాదాపు 105 రోజుల పాటు రంజింపజేసిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. తారల తళుకుబెళుకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని గెస్టులు స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. నాగార్జున కూడా తనదైన హోస్టింగ్తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ హైలైట్ అయింది.

ఐదుగురి మధ్య టైటిల్ ఫైట్
ఎన్నో అంచనాలతో మొదలైన బిగ్ బాస్ ఆరో సీజన్లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో మొత్తంగా 15 మంది ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆరంభంలో ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్లో ఉన్నారు. అందులో మిడ్ వీక్ ఎలిమినేషన్లో శ్రీ సత్య వెళ్లిపోయింది. దీంతో ఇప్పుడు కీర్తి భట్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఆది రెడ్డి మాత్రమే టైటిల్ పోటీలో మిగిలారు.

ఆ ముగ్గురు అలా బయటకు
బిగ్ బాస్ ఆరో సీజన్కు సంబంధించిన ఫినాలే ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. హౌస్లోకి ఎంటరైన హీరో నిఖిల్.. రోహిత్ను ఎలిమినేట్ చేశాడు. దీంతో అతడికి ఐదో స్థానమే దక్కింది. అతడి తర్వాత ఆది రెడ్డి నాలుగో స్థానంలో సరిపెట్టుకుని బయటకు వచ్చేశాడు. అలాగే, రవితేజ కీర్తి భట్ను ఎలిమినేట్ చేయడంతో ఆమె ఈ సీజన్లో మూడో స్థానంలోనే నిలిచింది.

ఆ ఆఫర్లను వద్దన్న ఇద్దరు
ఐదుగురిలో ముగ్గురు ఎలిమినేట్ అవడంతో బిగ్ బాస్ హౌస్లో రేవంత్, శ్రీహాన్ మాత్రమే మిగిలారు. దీంతో అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి గోల్డెన్ సూట్కేసుతో వెళ్లి వాళ్లకు ఆఫర్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ముందుగా వాళ్లకు రూ. 20 లక్షలు ఆఫర్ చేశాడు. ఆ తర్వాత రూ. 25 లక్షలు, రూ. 30 లక్షలు ఇస్తానని చెప్పాడు. కానీ, ఆ డబ్బును వాళ్లిద్దరూ వద్దని అన్నారు.

చివర్లో బిగ్ ట్విస్ట్.. విన్నర్గా
ఇక, శ్రీహాన్, రేవంత్ ఎంత ఆఫర్ చేసినా వద్దని అనడంతో ఈ సారి హోస్ట్ నాగార్జున రూ. 40 లక్షలు ఇస్తానని చెప్పాడు. దీంతో ఈ మొత్తానికి శ్రీహాన్ ఓకే అనేశాడు. ఫలితంగా అతడు రన్నరప్తో సరిపెట్టుకోగా.. రేవంత్ ఈ సీజన్లో విజేతగా నిలిచాడు. ఓట్లలో మాత్రం శ్రీహాన్ టాప్లో నిలిచినట్లు చెప్పి నాగార్జున అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు. ఇలా బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు.

ఆమె నిర్ణయం మార్చేసింది
ఎన్నో ట్విస్టుల నడుమ సాగిన ఆరో సీజన్ ఫలితంపై సోషల్ మీడియాలో ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. టాప్ 3 కంటెస్టెంట్లు హౌస్లో ఉన్నప్పుడు కీర్తి భట్ను ఆమె తరపున వచ్చిన వ్యక్తి అమౌంట్ తీసుకోమని అన్నాడు. కానీ, ఆమె డబ్బులు వద్దని చెప్పింది. అయితే, కీర్తి ఈ ఆఫర్కు ఓకే చెప్పుంటే పరిస్థితి వేరేలా ఉండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఆమె ఒప్పుకుంటే మరోలా
టాప్ 3 కంటెస్టెంట్లు ఉన్నప్పుడు రవితేజ వాళ్లకు రూ. 10 లక్షలు ఆఫర్ చేశాడు. తర్వాత నాగార్జున దాన్ని రూ. 15 లక్షలు చేశాడు. అప్పుడు కీర్తి కనుక ఈ ఆఫర్కు ఒప్పుకుని ఉంటే శ్రీహాన్కు రూ. 40 లక్షలు వచ్చేవి కాదు. అదే జరిగితే ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా అతడే విజేత అయ్యేవాడు. కీర్తి వద్దనడంతో శ్రీహాన్ డబ్బు తీసుకోవడం, రేవంత్ గెలవడం జరిగిందని చెప్పుకుంటోన్నారు.


Click it and Unblock the Notifications











