బిగ్బాస్ షో నిలిపివేత.. గేట్లు బద్దలు కొట్టిన పోలీసులు.. కంటెస్టెంట్ల పరుగులు.. ఎన్ని కోట్ల నష్టమంటే?
బిగ్బాస్ రియాలిటీ షో చరిత్రలో ఊహించని పరిణామం చోటు చేసుకొన్నది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని, అధికారులు ఇచ్చిన నోటీసులను తుంగలో తొక్కారనే ఆరోపణలపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రియాలిటీ షో కొనసాగుతుండగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి నిలిపివేశారు. దాంతో కర్ణాటకలోని జాలీవుడ్ స్టూడియోలో గందరగోళం ఏర్పడింది. కంటెస్టెంట్లను హుటాహుటిన ఓ రిసార్టుకు తరలించారు. ఈ సంఘటన ద్వారా ఎండెమాల్ షైన్ నిర్వాహకులకు ఎన్ని కోట్ల నష్టం వాటిల్లిందనే వివరాల్లోకి వెళితే..
బిగ్బాస్ కన్నడ సీజన్ 12 ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ సందీప్ కిచ్చ ఈ షోను రికార్డుస్థాయిలో నిర్వహించేందుకు సిద్దమయ్యారు. మొత్తం 17 మంది కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపారు. జాలీ స్టూడియోలో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. అయితే పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని హెచ్చరించాం. అందుకు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. కానీ నిర్వాహకులు నోటీసులను పట్టించుకోలేదు. ఈ విషయంలో చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అని కర్ణాటక అటవీశాఖ, పర్యావరణ వనరుల శాఖ మంత్రి ఈశ్వర్ ఖాద్రే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

జాలీ స్టూడియో, బిగ్బాస్ నిర్వాహకులకు రెండుసార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ అధికారులు, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వెంటనే స్టూడియోను సీజ్ చేశారు. దాంతో అర్ధాంతరంగా షోను ఆపివేయాల్సి వచ్చింది. అయితే ఈ షోను కొనసాగిస్తారా? లేదా మరోచోట నిర్వహిస్తారా? అనే విషయంపై ఇంకా సందిగ్థత కొనసాగుతున్నది. ప్రస్తుతం కంటెస్టెంట్లందరూ ఇండస్ట్రియల్ జోన్లోని ఈగల్టన్ రిసార్ట్లో ఉన్నారు.
స్టూడియో నుంచి కలుషిత వ్యర్థాలు, నీరు డ్రైనేజ్లోకి వెళ్తున్నాయనే ఫిర్యాదుతో అధికారులు తీవ్రమైన చర్యలకు ఉపక్రమించారు. వాటర్ యాక్ట్ 1974, ఎయిర్ యాక్ట్ 1981 చట్టం కింద నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసులను, అధికారులను నిర్వాహకులు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. స్టూడియోలోకి అనుమతించకపోవడంతో గేట్స్ బద్దలు కొట్టుకొని ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. అప్పటికే పరిస్థితిని గ్రహించిన నిర్వాహకులు కంటెస్టెంట్లను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ముందుగా స్టూడియోలోని థియేటర్లోకి పంపించి.. అనంతరం రిసార్టుకు తరలించినట్టు సమాచారం.

బిగ్బాస్ చరిత్రలో అనూహ్య పరిణామంగా చెప్పుకొంటున్న ఈ సంఘటనతో ఈ షో కోసం పనిచేసే 700 మంది సిబ్బంది రోడ్డును పడ్డారు. రాత్రికి రాత్రే జరిగిన సంఘటనతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. జాతీయ మీడియాలో హైడ్లైన్లను ఈ వివాదం ఆకర్షించింది. అయితే ఈ షో నిర్వాహణపై అధికారులు, ఎండెమాల్ షైన్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకొంటారా? అని వేచి చూస్తున్నారు.
జాలీ స్టూడియోలో బిగ్బాస్ 12 షో కోసం భారీగా సెట్ నిర్మాణం చేశారు. విలాసవంతమైన ఈ సెట్ నిర్మాణం కోసం సుమారుగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిసింది. అయితే మరోచోట పర్యావరణ అనుమతులు తీసుకొని మరో సెట్ వేస్తారా? ప్రత్యామ్నయ మార్గాలను వెతుకుతారా? బిగ్బాస్ షోను క్యాన్సిల్ చేస్తారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం అందర్నీ వెంటాడుతున్నాయి.


Click it and Unblock the Notifications











