ఏపీ సీఎంతో మెగాస్టార్ చిరంజీవి భేటి డేట్ ఫిక్స్.. జగన్ షరతులకు సినీ పరిశ్రమ తలవొగ్గుతుందా?
ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి సమస్యగా మారిన ఆంధ్రప్రదేశ్ టికెట్ల వ్యవహారం మరికొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ టికెట్ల వ్యవహారం గురించి చిరంజీవి బృందం సెప్టెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.. అయితే అనూహ్య కారణాలతో ముఖ్యమంత్రితో భేటీ రద్దయింది. తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి మరో సారి చిరంజీవి అండ్ టీమ్ కి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఎట్టకేలకు ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ సినిమా సమయం నుంచి టికెట్ల వ్యవహారంలో సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్లు ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసి అమ్ముకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లను, టికెట్ రేట్లను తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ఒక జీవో జారీ చేసి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు సిటీ ఇలా ప్రాంతాల వారీగా విభజిస్తూ రేట్లు నిర్ణయించింది. కానీ ఈ రేట్లతో సినిమా థియేటర్లు నడిపించాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో కలిసి మాట్లాడి రావాలని వాళ్లందరూ గతంలోనే కోరారు.

జగన్ తో భేటీ
ఈ మేరకు చిరంజీవి సహా టాలీవుడ్లోని మరి కొందరు పెద్దలు జగన్తో కలిసి మాట్లాడి రావాలని భావిస్తుండగా సెప్టెంబర్ 4వ తేదీన ఒక అపాయింట్ మెంట్ ఖరారైంది. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆ అపాయింట్మెంట్ రద్దు కావడంతో మళ్ళీ ఎప్పుడు ఈ మీటింగ్ జరగబోతోంది అనే అంశం మీద సరైన క్లారిటీ లేదు. తాజా సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ మరోసారి ఖరారైనట్లు తెలుస్తోంది.. ఈనెల 20వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి టాలీవుడ్ పెద్దలు జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారని తెలుస్తోంది.

20వ తేదీన
కరోనా సమయంలో తెలుగు పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు టికెట్ల వ్యవహారం లో కూడా సరైన నిర్ణయం తీసుకునే విషయంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి మాట్లాడాలని చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ద్వారా ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించింది. మంత్రి కూడా వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ వద్దకు తీసుకువెళ్లారు ఆ సమయంలోనే వారికి సమయం ఇద్దామని మాట్లాడి ఏదో ఒక విషయం ఫైనల్ చేద్దామని జగన్ చెప్పినట్లు సమాచారం.. అలా ఈ నెల 20వ తేదీన వారందరినీ అమరావతి రమ్మని జగన్ పేర్ని నాని ద్వారా ఆహ్వానం పంపినట్లు సమాచారం.

కొంచెం చూడండి సార్
కరోనా కాలంలో చాలా నష్టపోయాము కాబట్టి కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చిరంజీవి బృందం వైఎస్ జగన్ ను కోరే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త సినిమాలు బెనిఫిట్ షో లు వేసుకునే అవకాశం ఇస్తూ నగరాల్లో పట్టణాల్లో రోజుకు నాలుగు సార్లు ప్రదర్శించే అవకాశం కల్పించాలని కోరనున్నారని అంటున్నారు. అలాగే గ్రేడ్-2 కేంద్రాలలో నేల టిక్కెట్టు పది రూపాయలు కుర్చీ 20 రూపాయలు వసూలు చేసే విధానాన్ని రాష్ట్రమంతా వర్తింప చేయవద్దని ఈ బృందం వైయస్ జగన్ కోరడానికి సిద్ధమవుతోంది.
Recommended Video

పది శాతం కమిషన్
మరోపక్క ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా టికెట్లను అమ్మి ఆ డబ్బులను ప్రతి నెల 26వ తేదీన నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని వల్ల సినీ పరిశ్రమ నష్టపోతుంది అనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఇక జరుగుతున్న ప్రచారం మేరకు ప్రతి టికెట్ లో 10 శాతం ప్రభుత్వానికి కమిషన్ గా ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ డిమాండ్ విషయంలో వైయస్ జగన్ తో చిరంజీవి అండ్ బృందం ఎలా ఒప్పించి టాలీవుడ్ కు మేలు చేకూర్చబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











