ఆరోగ్యంతో తిరిగి వస్తారునుకొన్నా.. ఇంతలో అంత దారుణమా? చిరంజీవి ఎమోషనల్
పునాదిరాళ్లు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు రాజ్కుమార్ మరణవార్తతో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్కుమార్ మృతివార్త తెలుసుకొన్న చిరంజీవి తన సంతాప ప్రకటనలో ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
తన సంతాప ప్రకటనలో... దర్శకుడు రాజ్ కుమార్ మృతి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్ కుమార్ నన్ను కలసి తన దర్శకత్వంలో వస్తున్న"పునాది రాళ్లు" సినిమాలో వేషం వెయ్యమని అడిగారు. అప్పుడు నేను ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాను. పూర్తి కాకుండా నేను నటించడం బాగుందండీ అంటే కూడా బలవంతంగా నువ్వే చేయాలి అంటూ నాతో చేయించడం జరిగింది. అలా 'పునాది రాళ్లు' సినిమా షూటింగ్లో పాల్గొన్నాను. నా నట జీవితానికి అదే "పునాది రాళ్లు" వేసింది. ఈ మధ్యనే మా ఇంటికి వచ్చి కలిశారు, అనారోగ్యంతో ఉన్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నా దగ్గరకు వస్తారని అనుకున్నాను ఇంతలో ఇలా జరగటం చాలా బాధాకరం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అన్నారు.

1978లో పునాదిరాళ్లు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన గూడపాటి రాజ్కుమార్ సమాజ బాధ్యత గల చిత్రాలను రూపొందించారు. పునాదిరాళ్లు సినిమా తర్వాత ఈ సమాజం మాకొద్దు, మనవూరి గాంధీ, ఇంకా తెలవారదేమి? తాండవకృష్ణ తరంగం, మా సిరిమల్లి లాంటి చిత్రాలను రూపొందించారు. అలీ, బాబు మోహన్, అజయ్ ఘోష్, కవిత, సురేఖ వాణి లాంటి ఎందరో కొత్త నటీనటులను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు.


Click it and Unblock the Notifications











