కరోనాపై బిగ్ ఫైట్: ముందుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్.. రెండు రాష్ట్రాలకు విరాళం
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్దఎత్తున సహాయక చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా వైద్యబృందాలు ప్రాణాలకు తెగించి రేయింబవళ్లు కష్టపడుతున్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతున్నా.. రోజురోజుకీ కరోనాపై పోరాటాన్ని ఉదృతం చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.
కరోనా కట్టడిలో భాగంగా సహాయక చర్యలు చేపడుతూ ప్రభుత్వాలు చేస్తున్న ఈ సేవలో తామూ భాగం అవుతాం అంటూ ముందుకొస్తోంది టాలీవుడ్ సినీ లోకం. ఈ మేరకు పలువురు సినీ ప్రముఖులు తమ తమ ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ గొప్పమనసు చాటుకుంటున్నారు. నితిన్ తో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
ఇప్పటికే నితిన్, చిరంజీవి, కొరటాల శివ, సుకుమార్, సాయి ధరమ్ తేజ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, దిల్ రాజు, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఎందరో ప్రముఖులు ఆర్ధిక సాయం ప్రకటించగా తాజాగా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యం కూడా ముందుకొచ్చింది.

తమ వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 లక్షల ఆర్ధిక సాయం ఇవ్వనున్నట్లు అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. తెలంగాణ సీఎం రీలీఫ్ ఫండ్కి 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి మరో 10 లక్షలు ఆర్థికసాయం అందించబోతున్నామని ప్రకటించింది.


Click it and Unblock the Notifications











