OG: కర్ణాటకలో ఓజీకి నిరసన సెగ.. పవన్ కళ్యాణ్ మూవీ షోలు రద్దు
కళకు, కళాకారుడికి భాష, ప్రాంతీయ భేదాలు ఉండకూడదంటూ పెద్దలు చెబుతుంటారు. కానీ వాస్తవంలో జరిగేది వేరు. ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు అన్న పదం పోయి.. పాన్ ఇండియా సినిమాలు వచ్చి దున్నేస్తున్నాయి. అయినప్పటికీ ప్రాంతీయ, భాషా వివక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి దక్షిణాదిన తమిళ, కన్నడ ఇండస్ట్రీలు మిగిలిన పరిశ్రమలపై వివక్షను చూపుతున్నాయి.
ఇతర భాషలపై వివక్ష
గతంలో తమిళనాడు రాష్ట్రం ఈ విషయంలో ముందు వరుసలో ఉంటే ఇప్పుడు కర్ణాటక కూడా తమ ప్రాంతం, తమ భాష అంటూ మిగిలిన ప్రాంతాలను అవమానిస్తున్నాయి. తెలుగు ప్రజలు అన్ని భాషా చిత్రాలను, హీరోలను అభిమానిస్తుంటారు. కంటెంట్ నచ్చితే ఇంగ్లీష్ సినిమాలను, హీరోలను కూడా నెత్తిన పెట్టుకున్న చరిత్ర తెలుగువారి సొంతం. కానీ మనదేశంలోనే తెలుగు సినిమాను మాత్రం అవమానిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకకు చెందిన హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాలు భారీ ఎత్తున రిలీజ్ అవుతుండగా.. మన సినిమాల వరకు వచ్చేసరికి తమిళనాడు, కర్ణాటకలలో థియేటర్లు దొరకడం లేదు.

టాలీవుడ్కు కర్ణాటక పెద్ద మార్కెట్
దశాబ్ధాలుగా టాలీవుడకు కర్ణాటక రాష్ట్రం పెద్ద మార్కెట్గా ఉంది. కన్నడ సినిమాలను మించి తెలుగు సినిమాలను, హీరోలను అక్కడి ప్రజలు ఆదరిస్తుంటారు. శాండిల్వుడ్ తారలతో మన తెలుగు స్టార్స్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తమ సినిమాల రిలీజ్లకు ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి ప్రమోషన్స్ చేసిన సందర్భాలు ఎన్నో. ఈ క్రేజ్ నేపథ్యంలో తెలుగు సినిమాకు సంబంధించి కర్ణాటక రైట్స్ భారీ ధర పలుకుతుంటాయి.
గేమ్ ఛేంజర్కూ నిరసన సెగ
అయితే కర్ణాటకలో కన్నడ భాష అస్థిత్వాన్ని కాపాడుతున్నామనే వంకతో కొన్ని సంఘాలు గత కొంతకాలంగా ఓవరాక్షన్ చేస్తున్నాయి. కర్ణాటకలోని ఏ సంస్థ అయినా, దుకాణం అయినా వాటి పేర్లను కన్నడలోనే రాయాలని అల్టీమేటం జారీ చేస్తున్నాయి. ఈ సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు కూడా కర్ణాటకలో నిరసన వ్యక్తమైంది. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గేమ్ ఛేంజర్ పోస్టర్లను చించివేయడం, టైటిల్పై నల్లరంగు పూయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఓజీ ప్రీమియర్స్తో బెంగళూరులో సందడి
తాజాగా సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రానికి కూడా కర్ణాటకలో నిరసన సెగ తగిలింది. బెంగళూరులోని సంధ్య థియేటర్ వద్ద సెప్టెంబర్ 24వ తేదీన ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని పవన్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకోవడంతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. అయితే కన్నడ కార్యకర్త ఒకరు థియేటర్ వద్ద ఓజీ ప్రదర్శనపై నిరసన వ్యక్తం చేయడంతో పవన్ అభిమానులు అతనితో గొడవకు దిగారు. ఇంతలో మరికొందరు కన్నడ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.
కన్నడిగుల నిరసన
ఈ పరిణామాలతో సంధ్య థియేటర్ యాజమాన్యం ఓజీ ప్రీమియర్ షోను క్యాన్సిల్ చేసింది. అయితే కన్నడ కార్యకర్తలు ఎందుకు గొడవ చేశారన్న దానిపై స్పష్టమైన కారణం తెలియాల్సి ఉంది. అయితే ఓజీ సినిమా పోస్టర్లు కన్నడంలో లేకపోవడం వల్లే వారు నిరసనకు దిగారని, కాదు కాదు డీజేల రచ్చ కారణంగానే గొడవ జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు తమ అభిమాన నటుడి సినిమా చూడలేకపోవడంతో పవన్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











