Kantara Chapter 1: ఏపీలో కాంతార చాప్టర్ 1 టికెట్ ధరల పెంపు.. రిషబ్ శెట్టి మూవీకి టికెట్ ఎంతంటే?
రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన కాంతారకు ప్రీక్వెల్గా తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. రిషభ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విజయదశమి కానుకగా అక్టోబర్ 2న కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
కాంతార చాప్టర్ 1 బడ్జెట్ ఎంత?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్తో కాంతార చాప్టర్ 1ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. సెప్టెంబర్ 28వ తేదీన హైదరాబాద్లో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చి చిత్ర యూనిట్కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.

తెలుగు నాట భారీ అంచనాలు
గతంలో కాంతార విజయం నేపథ్యంలో తాజాగా రిలీజ్ కానున్న కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
తెలుగు సినిమాలపై కర్ణాటకలో వివక్ష
అయితే గత కొంతకాలంగా ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకోవడానికి, ప్రీమియర్స్ వేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి. అయితే స్ట్రెయిల్ తెలుగు సినిమాలతో పాటు వార్ 2, కూలీ వంటి డబ్బింగ్ చిత్రాలకు కూడా టికెట్ ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకు తెలుగు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. తెలుగు వాళ్లు ఇతర భాషా చిత్రాలకు ఇంతగా ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ.. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మన చిత్రాలపై వివక్ష చూపడాన్ని కొందరు గుర్తుచేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలంటూ కర్ణాటకలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
కాంతారకు పవన్ కళ్యాణ్ బాసట
దాంతో కాంతార చాప్టర్ 1ను కూడా బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ నడిచింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. కర్ణాటకలో తెలుగు చిత్రాలకు ఎదురవుతున్న పరిస్ధితులు నా దృష్టికి వచ్చాయి.. కానీ మనం కన్నడ సినిమాలకు ఇక్కడ ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు. డాక్టర్ రాజ్ కుమార్ నుంచి రిషబ్ శెట్టి వరకు కర్ణాటకకు చెందిన హీరోలను తెలుగు ప్రజలు ఆదరించారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఈ ఇబ్బందులపై రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్లు కూర్చొని మాట్లాడుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ఏపీలో కాంతార చాప్టర్ 1 టికెట్ ధరలు పెంపు
పవన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే కాంతార చాప్టర్ 1 సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ సెప్టెంబర్ 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఏపీలో కాంతార చాప్టర్ 1 సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని.. సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతించింది. అలాగే రిలీజ్కు ముందు రోజు రాత్రి (అక్టోబర్ 1) కాంతార చాప్టర్ 1 ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవచ్చని సూచించింది. దీనికి కూడా నిర్మాతలు టికెట్ ధరలను పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై కాంతార చాప్టర్ 1 యూనిట్ హర్షం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











